సిద్దిపేట అర్బన్/గజ్వేల్ అర్బన్, మార్చి 13: అభివృద్ధిలో గజ్వేల్, సిద్దిపేట పట్టణాలు ఎంతో ముందున్నాయని ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి కొనియాడారు. శనివారం హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ భరత్ గుప్తా, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ వీ రాముడు, రీజినల్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ రవీందర్రెడ్డితో కలిసి ఆమె సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో పర్యటించారు. సిద్దిపేటలోని కోమటిచెరువు, కేసీఆర్నగర్లోని డబుల్ బెడ్రూం ఇండ్లు, ‘సుడా’ నర్సరీని, చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద గల రంగనాయకసాగర్ను, గజ్వేల్లోని సమీకృత మార్కెట్ను సందర్శించారు. ఏపీలోని పలు పట్టణాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గజ్వేల్ మార్కెట్ను పరిశీలించినట్టు శ్రీలక్ష్మి పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, కోమటి చెరువు అందాలు బాగున్నాయని తెలిపారు.