నల్లగొండ ప్రతినిధి, మార్చి13నమస్తే తెలంగాణ: వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్కు సర్వం సిద్ధమైంది.
12జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన 731కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను నల్లగొండ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించనున్నారు. ఎన్నికల బరిలో ఈ సారి పెద్ద ఎత్తున 71మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో పాటు 5,05,565మంది ఓటర్లున్నారు.
మరింత జాగ్రత్తగా ఓటు వేయాల్సిందే…
బ్యాలెట్ పేపర్ సైజ్ భారీగా పెరిగింది. 18X24ఇంచులతో పేపర్ను ప్రత్యేకంగా ముద్రించారు. మూడు వరుసల్లో 20మంది చొప్పున 60మందిని, నాలుగో వరుసలో 11మంది అభ్యర్థుల వివరాలను, ఫొటోలను పొందుపరిచారు. దీన్ని నాలుగు మడతలుగా చేసి పెన్నుతో సహా బ్యాలెట్ పేపర్ను ఓటరు చేతికి ఇస్తారు. ఓటు వేసేందుకు కేటాయించిన సీక్రెట్ స్థలంతో బ్యాలెట్ పేపర్ను పూర్తిగా విప్పి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ సారి ఓటు వేసేటప్పుడు పట్టభద్రుడైన ఓటరు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. తను ఎంచుకున్న అభ్యర్థి ఎక్కడ ఉన్నాడో జాగ్రత్తగా పరిశీలించి ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది.
‘1’ ప్రాధాన్యత తప్పనిసరి…
తొలి ప్రాధాన్యత ఓటు తప్పనిసరి. లేదంటే ఆ ఓటు చెల్లుబాటు కాదు. తర్వాత ఎన్ని ప్రాధాన్యతలు ఇచ్చినా పరిగణలోకి తీసుకోరు. మొత్తం 71మంది అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడ కూడా ప్రాధాన్యత క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఇంగ్లిష్ లేదా రోమన్ అంకెల్లో ఓటు వేయవచ్చు. ఇంగ్లిష్ అంకెలను వాడడమే సులువైన పద్ధతి. ఉదాహరణకు ఓ అభ్యర్థికి 58వ ప్రాధాన్యత ఓటు ఇవ్వాలనుకుంటే రోమన్ అంకెల్లో కష్టంగా ఉంటుంది. అదే ఇంగ్లిష్ అంకెల్లో అయితే ‘58’ వేస్తే సరిపోతుంది. అందుకే ఇంగ్లిష్ అంకెల్లో ‘1,2,3,4,5,…. 71’వరకు ప్రాధాన్యతలు ఇవ్వొచ్చు. ఇలా అంకెలు కాకుండా అక్షరాల్లో రాస్తే ఓటు చెల్లుబాటు కాదు. ఉదాహరణకు ‘ఒకటి, రెండు, మూడు, నాలుగు… డబ్బు ఒకటి’ అని రాస్తే చెల్లని ఓటు కిందే లెక్క. ఇవేగాకుండా రైట్ లేదా ఇతర గుర్తులు, చిహ్నాలు ఇవేవీ బ్యాలెట్ పేపర్పైన రాసినా చెల్లని జాబితాలోకే వెళ్తాయి..
కిందటి సారి చెల్లని ఓట్లు 9.14శాతం…
ఓటర్లంతా పట్టభద్రులే… కనీసం డిగ్రీ పూర్తి చేసి ఆ విద్యకు తగ్గ ఓటు హక్కు పొందిన మేధావులు. వారిలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు.. ఇలా అంతా విద్యావంతులే. అంతటి మేధావులు సైతం ఓటేయడంలో తప్పటడుగు వేశారు. అందుకే 2015మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 9.14శాతం చెల్లుబాటు కాలేదు. మొత్తం 2,81,138ఓట్లకు గాను 1,53,547ఓట్లు పోలయ్యాయి. వాటిలో 1,33,552ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. 5956ఓట్లు నోటాకు పోగా 14,039ఓట్లు చెల్లుబాటు కాలేదు.
గతంలోనూ ప్రాధాన్యతలను పెన్నుతో స్పష్టంగా అంకెల్లో రాయాలని సూచించినా చాలా మంది అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో టిక్ చేశారు. కొందరు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వకుండానే ద్వితీయ, తృతీయ ఓట్లు వేశారు. మరికొందరైతే బ్యాలెట్ పత్రాలపై ఏవేవో రాతలు రాశారని కూడా తెలిసింది. ఇలా మొత్తం పోలైన ఓట్లలో 9.14శాతం మంది అవగాహన లోపంతో విలువైన ఓటు హక్కును వృథా చేసుకున్నట్లుగా స్పష్టమవుతున్నది.