సిటీబ్యూరో,మార్చి 10(నమస్తేతెలంగాణ) : ఇకనుంచి అవయవాలు విఫలమైన చిన్నారులకూ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరపనున్నారు. త్వరలో పీడియాట్రిక్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు ప్రారంభించేందుకు రాష్ట్రంలోని ప్రముఖ చిన్నపిల్లల దవాఖాన నిలోఫర్ హాస్పిటల్ సిద్ధమవుతున్నది. రోజురోజుకు పిల్లల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సల అవసరం పెరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని నిలోఫర్లో జీవన్దాన్ సెంటర్ ప్రారంభించినట్లు జీవన్దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత తెలిపారు. ప్రధానంగా పిల్లల్లో మూత్రపిండాల సమస్యలు అధికంగా ఉంటున్నట్లు గుర్తించామని, వీటితోపాటు గుండె, కాలేయం,కార్నియా వంటి ప్రధాన అవయవాలు అవసరమున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానల్లో మాత్రమే జీవన్దాన్ కేంద్రాలు ఉన్నాయని, అవయవదానం చేయాలనుకునేవారు, అవయవాలు అవసరమైన రోగులు ఈ మూడు దవాఖానల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశముండేది. అయితే ఇది కేవలం పెద్దలకు మాత్రమే. నిమ్స్లో 10 ఏండ్లు పైబడిన పిల్లలకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిపినట్లు డా.స్వర్ణలత తెలిపారు. అయితే 10 ఏండ్లలోపు, ఆపై వయస్సు గల పిల్లలకు కూడా నిలోఫర్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించాలని సంక్పలించినట్లు పేర్కొన్నారు.
ప్రముఖ చిన్నపిల్లల దవాఖాన నిలోఫర్లో బుధవారం జీవన్దాన్ కేంద్రాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, జీవన్దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత, ఉస్మానియా నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనీషాసాహెలతో కలిసి డీఎంఈ డాక్టర్ రమేష్రెడ్డి ప్రారంభించారు. పిల్లలకు సంబంధించి ఆర్గాన్ డోనర్స్కు కౌన్సెలింగ్ ఇవ్వడం, డోనర్స్కు సంబంధించి రిజిస్ట్రేషన్ వంటి కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిలోఫర్ ఓపీడీ ఆర్ఎంవో డాక్టర్ రమేష్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ నిర్మల పాల్గొన్నారు.
సాధారణంగా 10కిలోల బరువున్న శిశువుకు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు. ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కొంతమంది నవజాత శిశువుల్లో లివర్ సమస్యలు వస్తున్నాయి. వారికి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరముంటుంది. ఇవే కాకుండా గుండె, కార్నియా వంటి ఆర్గాన్స్ పీడియాట్రిక్స్కి అవసరముంటుంది. -డాక్టర్ మనీషాసాహె, నెఫ్రాలజీ విభాగం హెడ్, ఉస్మానియా దవాఖాన
ప్రస్తుతం 10 ఏండ్లు పైబడిన వారికి కేవలం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. ఇవి కూడా చాలా తక్కువ. కిడ్నీతోపాటు కాలేయం, గుండె, కార్నియా తదితర ప్రధానావయవాల మార్పిడి అవసరం పడుతున్నది. ఇవి నిలోఫర్లో జరగలేదు. ఇందుకోసమే నిలోఫర్లో జీవన్దాన్ సెంటర్ ప్రారంభించాం. త్వరలో శస్త్రచికిత్సలు ప్రారంభిస్తాం. -డాక్టర్ స్వర్ణలత, జీవన్దాన్ సమన్వయకర్త