సిటీబ్యూరో, మార్చి 10(నమస్తే తెలంగాణ): గ్రేహౌండ్స్కు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు పన్నిన కుట్రను సీసీఎస్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసు దర్యాప్తును దాదాపుగా పూర్తి చేశారు. ఇందులో భాగంగా సప్లిమెంటరీ చార్జిషీట్ను కోర్టుకు దాఖలు చేశారు. రూ.1500 కోట్ల విలువైన భూమిని కాజేందుకు ఏపీకి చెందిన తెలుగుదేశం నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబం ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి..
1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలోని సర్వే నం. 393/1 నుంచి 392/20 వరకు ఉన్న 142ఎకరాల 39 గుంటల భూమిని రాష్ట్ర పోలీస్ శాఖలోని గ్రేహౌండ్స్ విభాగానికి కేటాయించడంతో దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నది. అయితే గ్రేహౌండ్స్కు ఈ కేటాయింపులు చేయడాన్ని సవాలు చేస్తూ అవి అసైన్డ్ భూములని, తమకు 1961లో ప్రభుత్వం కేటాయించిందంటూ 20మంది అసైనీలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం స్టేటస్ కో(యథాతథ స్టితి) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడంతో, హైకోర్టులోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ సుప్రీం కోర్టు సూచించడంతో స్టేటస్ కో కొనసాగుతున్నది.
అసైనీలతో కొనుగోలు ఒప్పందాలు
ఈ భూములపై ప్రభుత్వానికి, అసైనీలకు మధ్య న్యాయస్థానంలో వివాదం జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి శివానందరెడ్డి భార్య ఉమాదేవి, వారి బంధువు ఆరోగ్యరెడ్డి రంగంలోకి దిగారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అసైనీలు, వాళ్ల వారసులతో ఆ స్థలాన్ని కోనేందుకు బేరాలు కుదర్చుకున్నారు. రూ.4 కోట్లకు ఎకరాకు ఒప్పందం చేసుకొని, అగ్రిమెంట్లు చేసిన వారికి రూ.8 లక్షల చొప్పున అడ్వాన్స్లుగా చెల్లించారు. ఆ భూములపై హక్కు పొందేందుకు ఒప్పందం చేసుకున్న వారితో జీపీఏలు కూడా చేసుకున్నారు.
పోలీసు శాఖ ఫిర్యాదు
అసైనీ చేతుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు గ్రేహౌండ్స్ స్థలాలను కొంటున్నారనే విషయం తెలుసుకొని, రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులకు పోలీసు శాఖ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ భూములను అడ్డదారిలో కొనుగోలు చేస్తూ, కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు హైదరాబాద్ సీసీఎస్లో ఐదు నెలల కిందట ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఉమాదేవి, ఆరోగ్యరెడ్డిలు గ్రేహౌండ్స్ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర చేశారనే విషయం నిర్ధారణ అయ్యింది. దీంతో ఉమాదేవి, ఆరోగ్యరెడ్డిలతో పాటు వాళ్లతో ఒప్పందాలు చేసుకున్న 60 మందికి సీసీఎస్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు అందించారు. ఉమాదేవి భర్త శివానందరెడ్డి మాజీ ఐపీఎస్ అధికారి కావడంతో పాటు తెలుగుదేశం పార్టీ తరపున నంద్యాల నుంచి గతంలో ఎంపీగా కూడా పోటీ చేశారు. ఈ కేసులో అన్ని ఆధారాలు సేకరించిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తును తుది దశకు తీసుకొచ్చారు. అందులో ప్రధాన నిందితురాలైన ఉమాదేవితో పాటు అసైనీలపై సప్లిమెంటరీ చార్జిషీట్లు దాఖలు చేశారు. ఆరోగ్యరెడ్డి పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నారు.