హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియా హై కమిషనర్ హాన్ బ్యారీ ఓ ఫారెల్ బుధవారం హైదరాబాద్లో ఆర్థికమంత్రి టీ హరీశ్రావుతో భేటీ అయ్యారు. ఆయనతోపాటు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సారా కిర్లూ, ఎకనమిక్ కౌన్సిలర్ పెర్సీబెల్ కూడా మంత్రి హరీశ్ను కలిశారు. తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలగురించి ఫారెల్ తెలుసుకొన్నారు. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ కోవిడ్ మహమ్మారి నుండి వేగంగా కోలుకున్నదని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి హరీశ్రావు చెప్పారు. టూరిజం, హాస్పిటాలిటీ రంగం పుంజుకుంట్టున్నదని పేర్కొన్నారు.
పెట్టుబడులు పెట్టే అంశంపైన ఈ భేటీలో చర్చ జరిగింది. సోలార్ పవర్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలకు అనువుగా ఉంటుందని మంత్రి చెప్పారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కు ప్రత్యేకతల గురించి మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని దీనిద్వారా ఏడాదికి 300 టీఎంసీల నీటిని లిప్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో సందర్శించనున్నట్లు ఆస్ట్రేలియా హై కమిషనర్ తెలిపారు. దేశంలో కొత్తగా ఆస్ట్రేలియా ఎంబసీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనుకుంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న హైదరాబాద్లో నెలకొల్పాలని మంత్రి హరీశ్రావు సూచించారు.