ఫుల్ స్ట్రిప్ అయితేనే ఇస్తాం.. లేదంటే ఇవ్వం..
జిల్లా పోలీస్ అధికారికే అడిగిన మేర ఇవ్వని వైనం
అడ్మిన్ ఎస్పీ ఫిర్యాదుతో మందుల దుకాణం సీజ్
మహబూబ్నగర్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లా అడ్మిన్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు.. తన కుమారుడి వైద్యం నిమిత్తం మం దులు అవసరమై పట్టణంలోని క్లాక్టవర్ వద్ద ఉన్న ఓ మెడికల్ షాపునకు వెళ్లారు. మొత్తం స్ట్రిప్ తీసుకుంటే మాత్రమే మందులు అమ్ముతామని.. ఒకటి, రెండు ఇవ్వమని తెగేసి చెప్పారు. దీనిపై సదరు అధికారి డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయగా.. ఆ మందుల దుకాణం లైసెన్స్ రద్దు చేశారు. అయితే, జిల్లా పోలీసు అధికారి కావడంతో ఆయన ఫిర్యాదు చేయగలిగారు అదే ఓ సామాన్యుడో, నిరుపేదో అయితే కనీసం ప్రశ్నించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకొచ్చిన గొడవ అనుకొని స్ట్రిప్ తీసుకుంటారు. అవసరమైన వరకు వాడుకొని మిగతా వాటిని పాడేసే పరిస్థితి వస్తుంది. కానీ ఖరీదైన మందులను కొనుగోలు చేసే క్రమంలో నిరుపేదల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీనికంతటికీ జిల్లా ఔషధ నియంత్రణ అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల దందాతో సామాన్యుడి నడ్డి విరుగుతున్నది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపి వదిలేస్తున్నారు.
ఇష్టం ఉంటే తీసుకో లేకుంటే లేదు..
‘నీకు ట్యాబ్లెట్లు కావాలా.. అయితే ఫుల్స్ట్రిప్ తీసుకో. లేదంటే లేదు. అంతా మా ఇష్టం. ఏ దుకాణానికి వెళ్లినా ఇదే పరిస్థితి. ఏం చేస్తావ్.. ఎక్కడో ఓ చోట తీసుకోక తప్పదు. లేదంటే రోగం ముదిరి పేషెంట్ చస్తాడు..’ ఇదీ పాలమూరులో కొందరు మెడికల్ షాపుల యజమానుల దందా. ‘తమకు ఒక్కటే ట్యాబ్లెట్ అవసరం. స్ట్రిప్ ఏం చేసుకుంటాం’ అని అడిగే పేషెంట్ల తరఫు బంధువులతో వారు మాట్లాడే తీరు. ‘ఉన్నతాధికారుల కు నెలనెలా మామూళ్లు ఇస్తున్నాం. మీరు వారికి ఫిర్యా దు చేసినా చేసేదేమీ ఉండదు. ఎవ్వరూ ఏమీ చేయలే రు’ అని దబాయిస్తున్నారు. దీంతో గత్యంతరం లేక దుకాణం యజమాని చెప్పినట్లే మందులు తీసుకొని వె ళ్తున్నారు. ఈ అనుభవమే ఓ జిల్లా పోలీసు అధికారికి ఎదురుకావడంతో వెంటనే స్పందించారు. తన స్థాయి వ్యక్తికే ఇలా ఉందంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆ లోచించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యా దు చేశారు. స్పందించిన అధికారులు క్లాక్టవర్ వద్ద ఉన్న ‘ఈ-హెల్త్’ దుకాణాన్ని సీజ్ చేశారు. కానీ, ఇది ఒక్క ఈ-హెల్త్ దుకాణంలో మాత్రమే లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్లా ఇదే పరిస్థితి. వైద్యం కోసం సామాన్యుడు తన స్థాయికి మించి ఖర్చు పెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్ దుకాణాల దందా వల్ల ఆ భారం మరింతగా పెరిగిపోతున్నది.
బిల్లులు ఉండవు.. అడిగిన మందులు ఇవ్వరు..
ప్రతి మందుల దుకాణంలో కంప్యూటరైజ్డ్ బిల్లులివ్వాలి. కానీ, చాలా చోట్ల ఆ ఊసే లేదు. కంప్యూటర్, ప్రింటర్ ఉన్నా వాటిని వినియోగించరు. దీంతో మం దుల ధర ఎంతో కూడా అర్థం కాదు. బిల్లు కావాలని అడిగితే సిస్టం పనిచేయడం లేదనో.. నేరుగా ఇవ్వమనో సమాధానం చెప్తారు. ప్రభుత్వం అందుబాటు ధరల్లో ఉండేలా ప్రవేశపెట్టిన జనరిక్ మందులు చాలా చోట్ల వి క్రయించరు. తమకు ఎక్కువ లాభాలు వచ్చే కంపెనీ మందులు మాత్రమే విక్రయిస్తున్నారు. ఉదాహరణకు జనరిక్ మందులకు రూ.20 ఖర్చయ్యే చోట.. రూ.100కు పైగా ధర పలికే కంపెనీ మందులే అమ్ముతున్నారు. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్నది. ఇక చాలా చోట్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మోతాదుకు మించి యాంటీ బయోటిక్స్ విక్రయిస్తున్నారు. సర్టిఫైడ్ ఫార్మసిస్టులు లేకుండానే షాపుల నిర్వహణ కొనసాగుతున్నది. మరికొన్ని చోట్ల సర్టిఫికెట్ ఒకరి పేరిట ఉంటే మరొకరు దుకాణాన్ని నిర్వహిస్తారు. దుకాణంలో పనిచేసే ఫార్మసిస్టులు తప్పనిసరిగా ఆఫ్రాన్ ధరించాలి. చా లా చోట్ల ఇది కనిపించదు. ఇక ప్రధాన ప్రైవేట్ దవాఖానల్లో ఉన్న మెడికల్ దుకాణాల్లో ఆడింది ఆట.. పాడింది పాటగా ఉంటుంది. వారికి లాభాలు వచ్చే కంపెనీల మందులు మాత్రమే అక్కడ లభిస్తాయి. అక్కడ వంద ల్లో ధర ఉండే మందులు జన ఔషధిలో కేవలం రూ. 10 నుంచి రూ.40 లోపు లభిస్తాయి. వీటన్నింటిపై ప ర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అసోసియేషన్ల ముసుగులో కొంద రు అధికారులను ప్రభావి తం చేసి తమ దందాకు అ డ్డురాకుండా చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు మెడికల్ మాఫియాగా మారి వ్యవస్థను దారుణంగా మార్చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పోలీసులకు ఫిర్యాదు చేయండి..
వినియోగదారుడు అడినంత మేరకే ట్యాబ్లెట్లు ఇవ్వాల్సిన బాధ్యత దుకాణదారుడిపై ఉంటుంది. ఫుల్ స్ట్రిప్ మాత్రమే ఇస్తాను అంటే కుదరదు. అలా చేస్తే సం బంధిత ఔషధ నియంత్రణ అధికారికి ఫి ర్యాదు చేయొచ్చు. వారు స్పందింకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయండి. చర్యలు తీసుకుంటారు. నాకే ఫుల్ స్ట్రిప్ విక్రయిస్తామని చెప్పారంటే.. వారు ఎలా దందా చే స్తున్నారో అర్థం అవుతున్నది. చాలా మంది పేదలు సరిపడా డబ్బులు లేక పరిమితంగా కొనుగోలు చే స్తారనే విషయాన్ని గుర్తించాలి. మెడికల్ దుకాణాల నిర్వహణ అనేది కేవలం సామాజిక కోణంలో చూ డాలి తప్పా వ్యాపారం కోణంలో చూ డొద్దు. మెడికల్ దుకాణ యజమాన్యా లు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా యి. ఫార్మసీ యాక్ట్ ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సేవాభావం కొరవడి వ్యాపార దృక్పథం పెరగడం వల్లే పేదలు వైద్యానికి దూ రంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలి.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..
స్ట్రిప్ తీసుకుంటేనే మందులు ఇస్తామని క్లాక్ టవర్ వద్ద ఉన్న ఈ-హెల్త్ అనే మెడికల్ షాపు ని ర్వాహకులు జిల్లా అడ్మిన్ ఎస్పీతో మాట్లాడినట్లు తమకు ఫిర్యాదు వచ్చింది. వెంటనే విచారణ జరిపి సదరు మెడికల్ షాపును సీజ్ చేశాం. అలా పూర్తి స్ట్రిప్ అమ్ముతామని పేర్కొనడం తప్పు. ఇలా ఎవరు చేసినా మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. మరోసారి అలా చేయబోమని సంబంధిత మెడికల్ దుకాణాల అసోసియేషన్ రాతపూర్వకంగా లెటర్ ఇచ్చింది. తక్కువ ధరలో లభించే జనరిక్ మందులు సైతం కంపెనీ మందుల్లాగే పనిచేస్తాయి. కాబట్టి తప్పనిసరిగా వీటిని సైతం మెడికల్ షాపుల వాళ్లు విక్రయించాలి.