అచ్చంపేట, జూలై 25: సీఎం కేసీఆర్ ఉపాధ్యాయుల పక్షపాతిగా వ్యవహరిస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, గెస్ట్ ఉద్యోగులు, కార్మికులకు 30శాతం పీఆర్సీ ప్రకటించి చరిత్రలో నిలిచిపోయారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి అన్నారు. ఆదివారం అచ్చంపేటలోని ఎస్జీ బాంకేట్హాల్లో జిల్లాలోని పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు పీఆర్సీ కేవలం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు మాత్రమే ఇచ్చారని, సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తింపజేశారన్నారు. కొత్త జిల్లాలు, కొత్త జోన్లు రాష్ట్రపతి ఆమోదం పొందడంతో ఇప్పుడు కొత్త జిల్లాలవారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయిన వెంటనే పదోన్నతులు, బదిలీలు చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాలు, జోన్లు రాష్ట్రపతి ఆమోదం పొందడానికి సమయం పట్టడంతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఆలస్యమైనదన్నారు. కొత్తజిల్లాలవారీగా ఉద్యోగుల కేటాయింపు త్వరితగతిన పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్తగా 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో నియామకమైన ఉద్యోగులు కొత్తజిల్లాల వారీగా ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందని, సీనియారిటీ నివేదిక కూడా తయారు చేస్తారన్నారు. స్కావెంజర్ అనే పదాన్ని ప్రభుత్వం తొలగించిందన్నారు. పాఠశాలల పరిసరాలు పరిశుభ్రం చేయించకుంటే పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకునేందుకు పాఠశాలల సెక్రటరి సర్క్యూలర్ జారీ చేశారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు కచ్చితంగా పాఠశాల పరిసరాలు శుభ్రం చేయించి ఫోటోలు ఆప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేయిస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యూలర్ ఎంఈవోల సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున కాంప్లెక్స్ హెచ్ఎంలను తీసుకొచ్చామన్నారు. ఏజెన్సీలో జీవో నెం.3పై ప్రభుత్వం కోర్టులో ఫిటిషన్ వేసిందని, పదోన్నతుల్లో అడ్డంకులోస్తే కోర్టు ఫిటిషన్లో పదోన్నతుల అంశాన్ని చేర్పించేందుకు కృషిచేస్తామని చెప్పారు. ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేస్తామన్నారు.
ప్రతి బాధ్యుడు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు పీఆర్టీయూ సాధించిన సమస్యలను వివరించాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యత్వాలు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత రాష్ట్రంలో పెద్దఎత్తున నిర్వహించే స్వర్ణోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. పీఆర్టీయూ గురించి మాట్లాడే హక్కు ఇతర సంఘాలకు లేద న్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా క్రమంగా పరిష్కారం చేసుకుందామన్నారు. రాష్ట్రంలోనే పీఆర్టీయూ క్రమశిక్షణ కలిగిన అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ, రాష్ట్ర నాయకులను సన్మానించారు. అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు భిచ్యానాయక్, పాండు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రాంచందర్రావు, మాసపత్రిక సహాయ సంపాదకుడు సత్యనారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, ప్రధాన కార్యదర్శి తుమ్మల సురేందర్రెడ్డి, జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.