కుమారస్వామికి షోడషోపచార పూజలు
శనగల బసవన్నకు పంచామృతాభిషేకం
క్షేత్రపాలకుడికి ప్రదోషకాల పూజలు
శ్రీశైలం, మే 18: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిక్షేత్రంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ పరివార దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసినట్లు కార్యనిర్వాహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాధి క్రతువులు నిర్వహించారు. కుమారస్వామిని పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని ప్రధాన అర్చకులు తెలిపారు. శివభక్త గణాలకు అధిపతి అయిన బయలు వీరభద్రుడికి సాయంకాలం ప్రదోషకాల పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. ఆరుబయట ఆలయంలో క్షేత్రపాలకుడిగా భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం సంధ్యా సమయంలో వీరశిరోమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక పూజాధి క్రతువులు నిర్వహించారు. కొవిడ్ ప్రభావం పూర్తిగా తొలిగిపోయి ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని వేదపండితులు, అర్చకులు మహా సంకల్పాన్ని పఠించారు. పంచామృతాలు ఫలోదకాలతోపాటు హరిద్రోదకం, భస్మోదకం, కుంకుమోదకం, గంధోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, సువర్ణోదకం, పుష్పోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరుడిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింపజేసి పంచసూక్తం వృషభసూక్తం పఠించారు. అనంతరం నూతన వస్ర్తాన్ని సమర్పించి నానబెట్టిన శనగలతో నైవేద్యం సమర్పించారు.