నాగర్కర్నూల్, అక్టోబర్ 19: మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని ప్రతి ముస్లిం ఆచరించాలని గుల్బర్గాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సయ్యద్షా కలిముల్లా హుస్సేనీ పేర్కొన్నారు. ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి జిల్లాకేంద్రంలోని జామామసీద్లో ముస్లింలు ముషావిరత్, యూత్, మసీద్ కమిటీల ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సయ్యద్షా కలీముల్లా హుస్సేనీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేవుడికి దూతగా, ఇస్లాంలో చిట్టచివరి ప్రవక్తగా మహ్మద్ ప్రవక్త ఇస్లాం సమాజానికి చూపిన దారిని ప్రతీ ముస్లిం అనుసరించాలని సూచించారు. పేదలను ఆదుకోవడం, దానధర్మాలు చేయడం ప్రతి ఒక్కరూ ఆచరించాలని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులను ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ముస్లింపై ఉందన్నారు. పండుగ సందర్భంగా జిల్లా అంతటా అన్నదానం, దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ, పేదలకు సరుకులు, ఇతర సామగ్రి పంపిణీ వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. మహ్మద్ ప్రవక్త వినియోగించిన వస్తువులు, ధరించిన దుస్తులు, ఆసారే ముబారక్(వెంట్రుకలు) ప్రదర్శనలో ఉంచారు. ప్రవక్త జన్మదినం సందర్భంగా జిల్లాలోని మసీద్లను విద్యుత్కాంతుల మధ్య ఆకుపచ్చని జెండాలతో సుందరంగా అలంకరించారు. జిల్లాకేంద్రంలోని జామా మసీద్ను యువకులు, మసీద్ కమిటీ ఆధ్వర్యంలో రంగురంగుల లైట్లు, పూలతో అలంకరించారు.
రక్తందానం.. మరొకరికి ప్రాణదానం
రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని లయన్స్క్లబ్ మాజీ గవర్నర్ జూలూరి రమేశ్బాబు పిలుపునిచ్చారు. మిలాద్ ఉద్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు లయన్స్క్లబ్, మసీద్ కమిటీ ఆ ధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలోని ఆల్విదాన్ మసీదు వద్ద మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ల యన్స్క్లబ్ మాజీ అధ్యక్షుడు జూలూరి రమేశ్బాబు ప్రారంభించగా 40 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో క్ల బ్ రీజియన్ చైర్మన్ చంద్రశేఖర్, క్లబ్ బృందం బావండ్ల వెంకటేశ్, మధు, పీఆర్వో పాషా, రమేశ్, మున్సిపల్ వైస్చైర్మన్ షాహెద్, కమిటీ మెంబర్ తాహెర్, మత పెద్దలు పాల్గొన్నారు.
ఘనంగా మిలాద్ ఉన్ నబీ
మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి పట్టణంలో ముస్లింలు మంగళవారం మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త శాంతి ప్రవచనాలు మనవాళికి మార్గదర్శనమని వక్తలు పేర్కొన్నారు. ప్రవక్తను స్మరిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
వెల్దండలో ముస్లింల ర్యాలీ
వెల్దండ, అక్టోబర్ 19 : మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ముస్లింలు మిలాద్ ఉన్-నబీ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఈద్గల వద్ద మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు అలీం, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సమీర్బాబా, నాయకులు షకీల్, జహంగీర్, అఫ్రోజ్, సాల్వదీన్, సమ్మద్, ఖలీల్, హమీద్, అఖీల్, అఫ్జల్, రహమాన్, అల్లాజీ, ఖాదర్, ఖాజా, వలియొద్దీన్, హరీఫ్, సాధిక్, నయీం, ఖాజా, దస్తగిరి, సద్దాం, వహీద్, జమీర్, రఫీ తదితరులు ఉన్నారు.
భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ
కల్వకుర్తి మండలంలోని ఆయా గ్రామాల్లో ముస్లింలు మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మత గురువులు ఖురాన్ చదివి వినిపించారు. ప్రవక్త బోధనలు సమాజంలో ఐకమత్యస్ఫూర్తిని పెంపొందించాయని అన్నారు.
బిజినేపల్లి మండలంలో..
మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం ముస్లింలు మిలాద్ ఉన్ నబీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మండలకేంద్రంలోని పీర్లగుట్టపై ఉన్న దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పాలెంలో ఉన్న మసీద్ నుంచి ప్రధాన రహదారి వద్ద ఉన్న దర్గా వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసి అక్కడకు వచ్చిన వారికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు తదితరులున్నారు.
తెలకపల్లి మండలంలో..
మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ముస్లింలు మిలాద్ ఉన్ నబీ పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా మహ్మద్ ప్రవక్తను తలుచుకుంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.