నాగర్కర్నూల్, సెప్టెంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లెప్రగతి’తో గ్రామాలు శుభ్రతలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలకేంద్రంతోపాటు, నాగర్కర్నూల్ మండలం చందుబట్ల పారిశుధ్యంలో మొదటిస్థానంలో నిలిచాయి. నిత్యం ఇంటింటికీ తిరుగుతూ సేకరించిన తడి, పొడి చెత్తను సెగ్రిగేషన్షెడ్కు తరలించి వేర్వేరు వేసి సేంద్రియ ఎరువును తయారుచేసి ఆదాయాన్ని రాబడుతున్నాయి. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించారు. అదేవిధంగా గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ చెత్త సేకరించేందుకు దిశానిర్ధేశం చేశారు. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, సైకిల్ రిక్షా తదితర సదుపాయాలు కల్పించారు. ఒక్కో సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణానికి రూ.2.51లక్షలు ఖర్చుచేశారు. జిల్లాలోని నాగర్కర్నూల్ మండలం చందుబట్ల సర్పంచ్ రమేశ్కుమార్, పంచాయతీ కార్యదర్శి రజిని ప్రత్యేక చొరవ చూపారు. ప్రభుత్వం కల్పించిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి వేరు చేయించారు. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ గ్రామంలో టాం టాం వేయించామని సర్పంచ్ పేర్కొన్నారు. సేకరించిన చెత్తను షెడ్కు తరలించి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నామని, ఎరువును అమ్మి పంచాయతీకి ఆదాయం పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే విధంగా కొనసాగిస్తే భవిష్యత్లో మరింత ఆదాయం సమకూర్చగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.