నాగర్కర్నూల్, (సెప్టెంబర్ 27) నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, కేసీఆర్ కిట్ ద్వారా మాతాశిశు రక్షణకు ప్రభుత్వ దవాఖానల్లోనే కాన్పులు చేసేలా చర్యలు తీసుకుంటున్నది. అదేవిధంగా పీహెచ్సీల్లో 24గంటల సేవలనూ అందిస్తూ అక్కడే కాన్పులు చేయిస్తుండడం గమనార్హం. ఇక కరోనాతో సహా డెంగీ, మలేరియా, అతిసారం లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఇదిలా ఉంటే శాశ్వతంగా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు మెడికల్ కళాశాలలతోపాటు డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం పీహెచ్సీలు, సబ్సెంటర్ల ద్వారా ప్రజలకు మండలస్థాయిలో వైద్యం అందుతున్నది. అయితే దీన్ని మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు సర్కార్ నడుం బిగించింది. హైదరాబాద్లో బస్తీ దవాఖానల మాదిరిగా గ్రామాల్లోనూ ఇకపై వైద్య సేవలను అందించేలా చర్యలు చేపడుతున్నది. దీనికిగానూ పల్లె దవాఖానల పేరిట వైద్యాన్ని ప్రజల ముంగిటకు తీసుకురానున్నది.
ప్రజలు చిన్నచిన్న జ్వరాలు, నొప్పులతోపాటుగా గుండెనొప్పి, పాముకాటు, ఇతర చికిత్సలు, గాయపడటంలాంటి సంఘటనల్లో పగలు, రాత్రిళ్లు తేడా లేకుండా స్థానికంగా ఉండే ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే గ్రామాల్లో సకాలంలో, తగిన వైద్యం అందక చాలామంది వ్యాధులు ముదిరి, ప్రాణాలు కోల్పోతున్న ఘటనలూ జరుగుతున్నాయి. ఇలా వైద్యం కోసం ప్రజలు ఇకపై ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం గ్రామస్థాయిలో పల్లె దవాఖానలను ఏర్పాటు చేయనున్నది. ప్రతి 5వేల జనాభాకు ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలన్నదే లక్ష్యం. రైతుల వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి 5వేల ఎకరాలకు ఒక ఏఈవో, రైతు వేదికల మాదిరిగానే ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పల్లె దవాఖానలు పనిచేయనున్నాయి. ప్రస్తుతం పీహెచ్సీ పరిధుల్లో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాల్లో పల్లె దవాఖానల సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ రోగులను పరీక్షించిన డాక్టర్ చిన్నచిన్న అనారోగ్యాలకు అక్కడే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా రక్తం, ఇతర పరీక్షలు చేయాల్సి ఉంటే శాంపిళ్లు సేకరించి సమీప పీహెచ్సీకి పంపించడం జరుగుతుంది. దీని ఆధారంగా రోగులకు వైద్యంపై సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సౌకర్యాలు లేని గ్రామాల ప్రాతిపదికన తీసుకొని పల్లె దవాఖానలను నిర్వహించనున్నారు. ఆరోగ్య ఉపకేంద్రాలకు కొత్త భవనాల కోసం ప్రభుత్వం ఇటీవలే నిధులు కూడా మంజూరు చేసింది. దీంతో పల్లె దవాఖానలకు ఏడాదిలోపు మంచి భవనాలూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
పల్లె దవాఖానలో ముగ్గురు సిబ్బంది
ఈ పల్లె దవాఖానల్లో ఓ ఎంబీబీఎస్ డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, సిస్టర్తో కలిపి ముగ్గురు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇందులో విధులు నిర్వహించే వైద్యుడి వయస్సు 34ఏండ్లలోపే ఉండేలా ఈ నెల 28న విడుదల చేయబోయే నోటిఫికేషన్లో ఉండనున్నది. ఇక ఈ సిబ్బంది స్థానికంగా సొంత జిల్లాలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోస్టుల భర్తీ జరుగుతుంది. సెలెక్ట్ అయిన డాక్టర్లకు బదిలీలు ఉండవు. ఈ పల్లె దవాఖానల నిర్వహణ, మందులు, సిబ్బంది జీతాలను నేషనల్ హెల్త్ మిషన్ కింద సమకూర్చడం జరుగుతుంది. ఇలా పల్లె దవాఖానలు త్వరలో ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు వేగం చేసింది. దీంతో ప్రజలందరికీ సొంతూర్లలోనే ఎంబీబీఎస్ డాక్టర్ల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో 26 పీహెచ్సీల పరిధిలో 178 సబ్సెంటర్లు ఉన్నాయి. దీనికిగానూ ప్రస్తుతం జిల్లాలో తొలి విడుతలో 88 పల్లె దవఖానలు మంజూరయ్యాయి. అక్టోబర్ చివరి నాటికి వైద్య సిబ్బంది నియామకం జరగునున్నది. అనంతరం పల్లె దవాఖానలు ప్రారంభం కానున్నాయి.
88 పల్లె దవాఖానలు మంజూరు
ప్రజలకు గ్రామాల్లోనే మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉండేలా పల్లె దవాఖానలను సిద్ధం చేస్తున్నది. నాగర్కర్నూలు జిల్లాకు 88 పల్లె దవఖానాలు తొలి విడుతలో మంజూరయ్యాయి. ఈ నెల 28న డాక్టర్లు, సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్ వేసి, వచ్చే నెలలో నియామకాలు పూర్తి చేస్తాం. త్వరలో ఈ పల్లె దవాఖానలు ప్రారంభిస్తాం.