లింగాల, జూలై 25: వ్యవసాయ సీజన్ వచ్చిందంటే ఫర్టిలైజర్ దుకాణాల డీలర్లు రైతుల నుంచి అందినంత దోచుకుంటున్నారు. మండల కేంద్రంలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాలు యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ డీలర్లు ఇష్టారాజ్యాంగా షాపులను నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు లైసెస్సుల్లో పొందుపర్చిన ప్రదేశంలోనే దుకాణాలు, గోదాంలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కొంతమంది డీలర్లు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో గోదాంలను కొనసాగిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ముఖ్యంగా దుకాణాల వద్ద తప్పనిసరిగా ఎరువులు, విత్తనాల నిల్వలు వాటి ధరల పట్టికను ఉంచాల్సి ఉండగా ఏ షాపులో కూడా అలాంటి నిబంధనలను పాటించడం లేదు.
కొనుగోలు దారులకు ఇవ్వని రశీదులు
ఫర్టిలైజర్ దుకాణాల్లో రైతులు ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేసిన వెంటనే డీలర్లు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏ డీలర్ కూడా ఈ నిబంధలను అమలు చేయడంలేదు. తెలిసిన వారికి మాత్రమే అక్కడక్కడా రశీదులు ఇస్తున్నారే తప్పా.. నిరక్షరాస్యులైన రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వడం లేదు. విత్తనాల ధరల్లో వివిధ రకాల తేడాలు కనిపిస్తున్నాయి. ఒకే రకమైన విత్తనం ఒక్కో రైతుకు ఒక్కో రకమైన ధరలతో విక్రయిస్తున్నారు.
చీటీల పేరుతో నకిలీ వ్యాపారం
మండలంలోని వివిధ గ్రామాల్లో నకిలీ వ్యాపారం గుట్టుచప్పుడుగా మూడుపువ్వులు ఆరు కాయాలుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నకిలీ వ్యాపారులు రైతుల పేరిట చీటీలను రాసి లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఆసాములకు పంపిణీ చేస్తున్నారు. దీంతో నకిలీ వ్యాపారుల దందా యథేచ్చగా కొనసాగుతున్నది. సంబంధిత అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ధరల పట్టిక ఏర్పాటు చేయాలి
ఫర్టిలైజర్ దుకాణాల్లో కచ్చితంగా ధరల పట్టికను ఏర్పాటు చేయాలి. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసిన వెంటనే రైతులకు రశీదులు ఇవ్వాలి. లేకుంటే లైసెన్స్ రద్దు చేస్తాం.