నాగర్కర్నూల్, జూలై 27: వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ నిర్వాసితుల పునరావాసానికి అన్ని వసతులతో ప్లాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ శర్మన్ అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ, అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కారుకొండ తండా, అన్కాన్పల్లి, అన్కాన్పల్లి తండా, రాంరెడ్డిపల్లి తండా, జిగుట్ట తండా గ్రామాలకు చెందిన 466 కుటుంబాలకు ఆర్అండ్బీ ప్యాకేజీ ద్వారా వట్టెం గట్టు వద్ద వారం రోజుల్లో లేఅవుట్లు పూర్తి చేసి నెంబర్ల వారీగా ప్లాట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల ప్రజలకు పునరావాసం కింద అన్ని మౌలిక వసతుల కల్పనకు రూ.23కోట్లతో పాఠశాల, అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పార్కులు, కమ్యూనిటీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి సదుపాయాలు కల్పిస్తూ పీపీ రావు అండ్ కంపెనీ ఏజెన్సీ వారు నిర్మాణాలను ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. నిర్వాసితులే ఎవరికి ఎక్కడ ప్లాట్ కావాలో నిర్ణయించుకొని కమిటీ ద్వారా ఆమోదం తెలిపితే వెంటనే పట్టా సర్టిఫికెట్లు జారీ చేయాలని, అందుకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు నాణ్యతతో వెంటనే ప్రారంభించాలని ఏజెన్సీని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో నాగలక్ష్మి, ఈడబ్ల్యూడీసీ డీఈ ప్రతాప్, పీపీ రావు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.