ములుగు, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ) : నీతి ఆయోగ్ బృంద సభ్యులు బుధవారం ములుగు జిల్లాకు రానున్నారు. ఈమేరకు సంస్థ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్కుమార్, ఆయన సతీమణి డాక్టర్ వినీతాశంకర్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె. రాజేశ్వర్రావు, సీనియర్ సలహాదారుడు నీరజ్సిన్హా, సీనియర్ కన్సల్టెంట్ రాకేశ్రంజన్, వైస్చైర్మన్ అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ శివంతోటియా రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు గట్టమ్మ ఆలయం వద్ద ఉన్న హరితగ్రాండ్ హోటల్లో అల్పాహారం చేసి సమీపంలో రూ.45 లక్షలతో కొత్తగా నిర్మించిన న్యూట్రీషన్ రిహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి ప్రేమనగర్కు చేరుకొని కొత్త హంగులతో పిల్లలకు బడి వాతావరణం నెలకొల్పేలా నిర్మించిన మోడల్ అంగన్వాడీ సెంటర్ను సందర్శించనున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇంచర్ల గ్రామానికి వెళ్లి రైతు వేదిక, పల్లె ప్రగతిలో భాగంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్తో పాటు జీపీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలను పరిశీలించనున్నారు. అనంతరం వెంకటాపూర్ మండలానికి చేరుకొని పాలంపేట గ్రామంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. రుద్రేశ్వరుడి దర్శనం ముగిసిన తర్వాత అక్కడి నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్లనున్నారు.
ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం
నీతి ఆయోగ్ బృంద పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ సోమవారం నీతి ఆయోగ్ బృందం సభ్యులు పర్యటించనున్న ప్రాంతాలను సందర్శించి కావాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో రెండు జిల్లాల అధికారులతో నిర్వహించే రివ్యూకు సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షించారు. కాగా, మంగళవారం తహసీల్దార్ మధురకవి సత్యనారాయణస్వామి ఎన్ఆర్సీ భవనాన్ని పరిశీలించి చేపడుతున్న పనులను పూర్తి చేయించారు. అలాగే జిల్లా సంక్షేమ శాఖ అధికారులు సైతం ఈ భవనాన్ని సందర్శించారు. జిల్లా పంచాయతీ శాఖ అధికారి, విద్యాశాఖ అధికారి ఇంచర్లలో ప్రభుత్వ పాఠశాల, రైతు వేదిక, జీపీ కార్యాలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు.
చెల్పూర్లో మిర్చి రైతులతో..
కృష్ణకాలనీ: నీతి ఆయోగ్ బృందం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం 11:45 గంటలకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, బృంద సభ్యులు గణపురం మండలం చెల్పూర్ రైతు వేదికలో మిర్చి రైతులను కలిసి జిల్లాలో మిర్చి పంటల ఉత్పాదకత, ప్రాసెసింగ్, మార్కెటింగ్, తదితర అంశాలపై చర్చించనున్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మేరకు రైతువేదిక ప్రాంగణంలో వివిధ శాఖల స్టాళ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సమీక్షలో సీపీవో శామ్యూల్, డీఆర్డీవో పురుషోత్తం, డీపీవో ఆశాలత, ఎల్డీఎం శ్రీనివాస్, జిల్లా వ్యవసా య అధికారి విజయ్భాస్కర్, ఆర్డబ్ల్యూస్ ఈఈ నిర్మల, జీఎం డీఐసీ శ్రీనివాస్, ఎంపీడీవో అరుంధతి, సీడీపీవో అవంతి, చెల్పూర్ సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్రావు పాల్గొన్నారు.