ములుగురూరల్ : జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు కృషి చేస్తూ పని దినాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం జాకారం గ్రామంలోని డీఆర్డీఏ కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై డీఆర్డీఏ పీడీ నాగపద్మజ అధ్యక్షతన ఎంపీడీవోలకు, ఎంపీవోలకు నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను ఏడాది కాలం పాటు రక్షించినట్లైతే అవి మన జీవిత కాలానికి సరిపడ పర్యావరణాన్ని అందిస్తాయని అన్నారు. కమ్యూనిటీ టాయిలెట్ల ఏర్పాట్లకు ఎంపీడీఓల కృషి అభినందించదగ్గదని కొనియాడారు. ప్రజల సంచారం అధికంగా ఉన్న ప్రదేశాలలో నిర్మాణ పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఇంకుడు గుంతల నిర్మాణంతో అనేక ఉపయోగాలు..
ఇంకుడు గుంతల నిర్మాణాల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు, భూగర్భ జలాలు పెరిగేందుకు ఇంకుడు గుంతలు ఉపయోగపడుతాయని అన్నారు. వాటి నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసి రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టాలన్నారు. పీఎంజే ప్రొగ్రాంలో 35శాతం సబ్సిడీతో రూ. 25లక్షల రుణం మంజూరీకి అవకాశం ఉందని, యువతకు దీనిపై అవగాహన ఏర్పర్చి జీవనోపాధి కల్పించాలని అన్నారు. పర్యాటక క్షేత్రాలు అధికంగా ఉన్న ములుగు జిల్లాలో యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
మేడారం మహా జాతరలో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలలో నిబంధనల మేరకు షాపులు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసి స్థానికులకు అవకాశం కల్పిస్తూ ఉత్సాహవంతులైన నిరుద్యోగ యువత ముందుకు వచ్చినట్లయితే రూ. 2 నుంచి 25లక్షల వరకు బ్యాంకు రుణం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో ఏపీడీఎం వెంకటనారాయణ, జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.