ములుగురూరల్ : ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ పర్యవేక్షణ బృందం సభ్యులు గురువారం సందర్శించారు. కళాశాలలో నిర్వహిస్తున్న కోర్సుల నిర్వాహణ, నాణ్యతను పరిశీలించి మెరుగైన గుర్తింపును, గ్రేడ్ను ఇచ్చేందుకు దీన్దయాల్ ఉపాధ్యాయ గోరక్పూర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రాజేశ్సింగ్ చైర్మన్గా, కో-ఆర్డినేటర్గా నార్త్ ఒరిస్సా విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ లింక జగన్నాథం, అస్సాం కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బోరచైతన్యలు పాల్గొన్నారు. వీరందరికి కళాశాల విద్యార్థులు, సాంస్కృతిక కళా నృత్యాలతో స్వాగతం పలికారు.
న్యాక్ బృందం సందర్శనకు పర్యావేక్షకులుగా తెలంగాణ కళాశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు బీఎస్ఆర్ రాజేందర్సింగ్ హాజరై ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం చేపట్టిన సంస్కరణలను న్యాక్ బృందానికి వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ రజినీలత ప్రగతి నివేదికను న్యాక్ బృందానికి సమర్పించారు. కళాశాల కో-ఆర్డినేటర్ ఎన్ఆర్సీహెచ్ శ్రీకాంత్ కళాశాలలో నిర్వహిస్తున్న వివిధ కోర్సుల, బోధనకు సంబంధించిన కార్యక్రమాల ప్రగతి నివేదికను సమర్పించారు.
అనంతరం న్యాక్ బృందం కళాశాలలోని వివిధ విభాగాలను సందర్శించారు. అనంతరం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, బోధన, బోధనేతర సిబ్బంది ప్రత్యేకంగా సమావేశమైన న్యాక్ బృందం సభ్యులు కళాశాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాగా, న్యాక్ బృందం సభ్యుల పర్యటన నేడు సైతం కొనసాగనున్నదని ప్రిన్సిపాల్ రజనీలత తెలిపారు.