అన్నదాతకు వానకాలం పెట్టుబడి సాయం
జూన్ 15 నుంచి ఖాతాల్లో ‘రైతుబంధు’ నగదు జమ
అదే నెల 25లోపు అందరికీ పంపిణీ
తాజా వివరాల ప్రకారం సాగు వివరాల నమోదు
ఈ నెల 10లోపు పూర్తికానున్న ప్రక్రియ
యాసంగిలో రూ.812.89 కోట్ల చెల్లింపులు
ఆరు జిల్లాల్లో 7.42 లక్షల మంది రైతులు
వరంగల్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అండగా నిలుస్తోంది. పుష్కలంగా సాగునీరు, నిరంతరంగా కరెంటు ఇస్తున్న ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయమూ అందిస్తోంది. ‘రైతు బంధు’ పథకం కింద ఎకరాకు ప్రతి సీజన్లో రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమచేస్తోంది. వానకాలం సీజన్ మొదలవుతున్న తరుణంలో రైతులకు వెంటనే పెట్టుబడి సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 15 నుంచి 25వరకు రైతు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వానకాలం సీజనులో రైతులకు అవసరమైన పెట్టుబడికి అవసరమయ్యేలా ‘రైతు బంధు’ చెల్లింపు ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈమేరకు సాగు విభాగంలో ఉన్న ప్రతి భూమికి రైతు బంధుసాయం అందించేలా వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 7,42,206 మంది రైతులకు యాసంగి సీజన్లో ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. తాజాగా జరిగిన భూముల మార్పులతో రైతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 16.50 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, సాగు భూమి నుంచి ఇతర అవసరాల కోసం మారిన భూముల వివరాలను అధికారులు తాజాగా నమోదు చేస్తున్నారు. వివరాలను సరి చూసి అధికారులు ధ్రువీకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో ‘రైతు బంధు’ నగదు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమవుతాయి.
జూన్ 10 కటాఫ్..
సాగుచేసే ప్రతి భూమికి పెట్టుబడి సాయం అందించాలని, దీనికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలోకి చేరిన భూములకు రైతు బంధుసాయం అందించేలా సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూన్ 10లోపు ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి సాగు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఆర్వోఎఫ్ఆర్ భూములకు సైతం ఈ సాయం అందించనున్నారు. పోడు భూముల్లో ఎన్నో ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యంతో తీసుకున్న నిర్ణయం ఎంతో ఊరట కలగిస్తోంది. దేశానికి జీవనాధారంగా, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు మూలాధారంగా ఉన్న వ్యవసాయరంగం బలోపేతం కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ‘రైతు బంధు’ పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతులు సొంతంగా పెట్టుబడి సమకూర్చే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్రంలో వ్యవసాయ అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తున్నారు. రైతులు ఆర్థిక స్వావలంబన సాధించే వరకు సాగుకు అవసరమైన అన్నింటినీ సమకూర్చుతున్నారు. దీంట్లో భాగంగానే సాగునీరు, నిరంతరంగా ఉచిత కరంట్, ‘రైతు బంధు’ పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.15 వేల కోట్లను ‘రైతు బంధు’ పేరిట అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఇస్తోంది. వానకాలంలో పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమైంది.