ఆపత్కాలంలో భీతిగొలిపేలా పోస్టులు
భరోసా ఇవ్వాల్సింది పోయి భయాందోళనలు
తప్పుడు ప్రచారంతో లేనిపోని టెన్షన్
ఆందోళన కలిగించేలా మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు
కొందరి విపరీత ధోరణి.. మరికొందరి ప్రాణాలమీదికి
అడ్డూఅదుపులేని పోస్టులతో మానసిక ఒత్తిడి
రాంగ్ పోస్టులు పెడితే చట్టపరంగా చర్యలు
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 128 కేసులు
కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు
వరంగల్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ‘మిత్రమా.. ఎట్లున్నవ్! కరోనా పాజిటివ్ అని తెలిసింది. జాగ్రత్తగా ఉండు. మందులు వేసుకో. ఆక్సిజన్ లెవల్ చెక్ చేసుకో. ధైర్యంగా ఉండు. అన్నింటి కంటే ముఖ్యమైందేంటంటే టీవీ లు, ఫోన్లు చూడకు. సోషల్ మీడియానున అసలే చూడ కు. పనికి మాలింది పెట్టి భయపెట్టిస్తున్నరు. మర్చిపోకు. ఏ అవసరం ఉన్నా ఫోన్ చెయ్యి’.. దోస్తుకు, సుట్టాలకు, పక్కింటోళ్లకు, ఆఫీసోళ్లకు, తెలిసిన వాళ్లకు ఎవరికి కరోనా వచ్చిందని తెలిసినా మంచిని కోరుకునేవారెవరైనా ఇచ్చేది ముం దుగా ధైర్యమనే మందే.. టెక్నాలజీ పెరిగిన ప్రస్తుత కాలంలో వ్యాధులు, వైరస్, వైద్యంపై ఎక్కువగా అవగాహన వచ్చేందుకు సోషల్ మీడి యా దోహదపడాలి. ఆలోచనల్లో లోపం వల్లనో లేక కావాలని చేస్తున్నారో గానీ, ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతున్నది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది, సోషల్ మీడి యా అనేది భాగమై పోయాయి. కానీ, ఇందులో పం చుకునే సమాచారం పాజిటివ్ కంటే నెగెటివ్కు సంబంధించినవే ఎక్కువ ఉంటున్నాయి.
కరోనా వైరస్ అయినా, కశ్మీర్ విషయం అయినా, ఇజ్రాయిల్ యుద్ధమైనా.. ఎక్కడేం జరిగినా తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు క్షణాల్లో నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అవగాహన లేమి కొంత వరకు కారణమైతే, చాలా మంది విద్యావంతులే ఎక్కువసార్లు ఇలాంటి వాటికి కేంద్రంగా నిలవడం అత్యంత విషాదకరం. విపత్తులు వచ్చినప్పుడు, కరోనా కమ్మేస్తున్నప్పుడు పక్క వారికి ధైర్యం కల్పించే బదులు భయపెట్టే వాటినే వెతికి మరీ వ్యాప్తి చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి కంటే వేగంగా సోషల్ మీడియాలో భయపెట్టే తప్పడు సమాచారమే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నది. ఇది ఎన్నో అనర్థాలకు దారి తీస్తున్నది. ఎక్కడో, ఏదో జరిగిందని తప్పుడు సమాచారం చేరవేయడం వల్ల అది చదివిన వారు అన్వయించుకుని మరింత ఆందోళనపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. అప్పటికే అనారోగ్యంతో ైస్థెర్యం కోల్పోయిన వారికి ఇలాంటివి మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి.
విద్వేషాలకు వేదిక..
సోషల్ మీడియా ప్రపంచాన్ని దగ్గరగా చేసిందిగానీ మనుషుల మధ్య దూరం పెంచుతున్నది. అనవసర విద్వేషాలకు ఎక్కువగా వేదికకవుతున్నది. అనవసర అంశాలపై రెండు గ్రూపులుగా విడిపోయి వాదనలు పెంచుకోవడంతో విద్వేషా లు పెరుగుతున్నాయి. కరోనా ఉధృతి వేళ అందరికీ భరోసా కల్పించేలా ఉండాల్సిన సోషల్ మీడియా తప్పుడు సమాచారంతో, ఏదో జరుగుతోందని భయపెడుతోంది. కొందరు చేసే పోస్టులతో తమకు జరగరానిది జరుగుతుందనే ఆందోళన పెరుగుతోంది. ఎవరు, ఏ స్థాయి వారు అనే విచక్షణ లేకుండా కొందరు ఉన్నతమైన వ్యక్తులను సైతం కించ పరిచేలా పోస్టులు పెడుతున్నారు. అందులోనూ అన్నీ తెలిసిన కొందరు కూడా ఇలా నే ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివే విస్తృతంగా ప్రచారమవుతుండడంతో ఎక్కువ మంది ఆందోళనకు కారణమవుతున్నాయి. ఊరుపేరు లేని వ్యక్తులు డూప్లికేట్ ఐడీలు క్రియేట్ చేసి రాష్ట్రపతి నుంచి సర్పంచ్ల వరకు తప్పుడు పోస్టులు పెట్టడం, మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలతో కించపరచడం చేస్తున్నారు. చేసేది తప్పని తెలియక, అలా చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అవగాహన లేక చాలా మంది ఫేక్, దుష్ప్రచార పోస్టులు పెడు తూ కటకటాల పాలవుతున్నారు. ఇక కొందరు అన్నీ తెలిసిన వారు సైతం ఇలానే చేస్తుండడంతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక సందర్భంలో జరిగిన వాటిని మరో రకంగా మార్ఫింగ్ చేస్తూ పోస్ట్ చేయడం అనేక అనర్థాలకు దారి తీస్తున్నది. కొందరిలో మానసిక ఒత్తడి సమస్యలు వస్తున్నాయి. ఇది రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది.
తప్పుడు పోస్టులపై చర్యలు ఇవీ..
ఐటీ యాక్టు 66డీ : కంప్యూటర్, ఫోన్ వంటి ఏదైనా ప్రచార సాధనంతో ఇతరులను అవమానించినట్లు, మోసం చేసినట్లు రుజవైతే మూడేండ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు.
ఐపీసీ 153 : ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా, అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టే ప్రచారాలు చేసినా ఏడాదిపాటు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది.
ఐపీసీ 499, 500 : మాటలు, చేతలు, రాతలు, చదవడం వంటి చర్యలతో ఇతరులను అవమానించేలా చేస్తే రెండేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
ఐపీసీ 505(1) : ప్రజలు ఆందోళన చెందేలా వార్తలు ప్రచురించడం, ప్రచారం చేయడం వంటివి చేస్తే మూడేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. విపత్తులు వస్తున్నాయని, దేశ సమగ్రతకు భంగం కలుగుతున్నదని తప్పుడు ప్రచారం చేస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద ఏడాది జైలు శిక్ష ఉంటుంది.
కమిషనరేట్ పరిధిలో 103 కేసులు..
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేరవేయడం, తప్పుడు పోస్టులు పెట్టిన విషయాలపై వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల్లో కలిపి 103 కేసులు నమోదయ్యాయి. 93 కేసులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మహబూబాద్ జిల్లాలో 25 కేసులు నమోదుకాగా, వీటిపైనా పోలీసులు చర్యలు చేపట్టారు.
మానసిక ఒత్తిడితో ఆరోగ్య సమస్యలు
కరోనా వేళ ఇప్పుడు అందరూ మానసికంగా దృఢంగా ఉండాలి. మానసిక సమస్యలు వస్తే రోగ నిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాను మన జీవితంలో విడిగా చూడలేం. మనం చదివేది మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. తప్పుడు సమాచారం చదివితే త్వరగా ఆకర్షితులవుతాం. దాన్ని ఇతరులకు పంపాలనే కుతూహలం ఉంటుంది. నెగిటివ్ అంశాలను చదవడం, ఇతరులకు పంపడంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు నెగిటివ్ సమాచారం అందించే వెబ్సైట్లకు, సోషల్ మీడియా గ్రూపులకు, ఫేస్బుక్ పేజీలకు దూరంగా ఉంటే మంచిది.
ఎర్ర శ్రీధర్రాజు, మానసిక వైద్య నిపుణుడు
తప్పుడు పోస్టులు పెడితే చర్యలు
ఇటీవల చింతనెక్కొండలో ఒకరు చనిపోయారు. దీనిపై ఆ ఊరి వాట్సాప్ గ్రూపులో ఓ వ్యక్తి తప్పుడు పోస్టు పెట్టాడు. దానిపై అనవసరంగా వివాదం కలిగేలా మరో వ్యక్తి పోస్టు పెట్టాడు. ఇలా ఇద్దరూ పరస్పరం పోస్టులు పెట్టుకుంటూపోవడంతో ఆ గ్రూపు వారిలో, ఊరిలో అనవసర ఆందోళనలు కలిగే పరిస్థితి వచ్చింది. పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. వారి సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో అడ్మిన్కు సమాచారం ఉండి పోస్టులు పెడి తే వారిపైనా చర్యలు తీసుకునే అవకాశముంది. వ్యక్తిగతంగా ఇతరులను కించపరచడం, వదంతులు సృష్టించడం, లేనిపోని ఆందోళనలు కలిగేలా పోస్టులు పెట్టడం వంటివి చేస్తే కేసులు తప్పవు.
ఏ నరేశ్కుమార్, ఏసీపీ, మామునూరు