కొవిడ్తో ఏ ఒక్కరూ చనిపోవద్దు
సడలింపులను దుర్వినియోగం చేయొద్దు
లాక్డౌన్కు ప్రజలు సహకరించాలి
ములుగులో వంద ఆక్సిజన్ బెడ్లు
మంత్రి సత్యవతి రాథోడ్
గాంధీ పూర్వవిద్యార్థులు సమకూర్చిన వైద్య పరికరాలు ములుగు దవాఖానకు అందజేత
భూపాలపల్లిలో 30 ఆక్సిజన్ బెడ్లతో కొవిడ్ సెంటర్ ప్రారంభం
ములుగు, మే18 (నమస్తే తెలంగాణ)/ భూపాలపల్లి టౌన్ : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సర్కారు దవాఖానల్లో మౌలిక వసతులను మెరుగుపర్చిందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మంగళవారం ఆమె జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ శ్యాంసుందర్ తన బ్యాచ్కు చెందిన గాంధీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సహకారంతో రూ.20లక్షల విలువైన వైద్యపరికరాలు సమకూర్చగా, ఎమ్మెల్యే సీతక్క, జడ్పీచైర్మన్ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణఆదిత్య, ఐటీడీఏ పీవో హన్మంతుజెండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ్సురభితో కలిసి మంత్రి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్కు అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా దవాఖానల్లో ఏర్పాటు చేసిన 30 ఆక్సిజన్ బెడ్ల కొవిడ్ సెంటర్ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీచైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణిరాకేశ్తో కలిసి ప్రారంభించారు. వైద్యశాఖ అధికారులు, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై కరోనా పరిస్థితులపై చర్చించారు. అనంతరం మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే గండ్రకు వైద్యులు రక్త పరీక్షలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనాతో వైద్యం అందక ఏ ఒక్కరూ చనిపోవద్దనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకనుగుణంగా ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ములుగు జిల్లాలోని రెండు ప్రభుత్వ దవాఖానల్లో వంద ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్స అందింస్తున్నట్లు తెలిపారు. గాంధీ మెడికల్ కళాశాల పూర్వవిద్యార్థులైన గ్లోబల్ అల్యూమిని అసోసియేషన్ సభ్యులు కరోనా చికిత్సకు అవసరమయ్యే 20 పల్స్ ఆక్సీమీటర్లు, తొమ్మిది ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, బిపాప్ మిషన్, 3వేల ఎన్-95 మాస్కులు ములుగు దవాఖానకు అందజేయడం అభినందనీయమన్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రజలు వైద్యఆరోగ్య, ఇతర శాఖల అధికారులకు సహకరించాలని కోరారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇచ్చిన సడలింపులను అత్యవసరమైతేనే వినియోగించుకోవాలని, దుర్వినియోగం చేయొద్దని కోరారు. ఆక్సిజన్ కొరత తీర్చేందుకే సీఎం కేసీఆర్ ములుగు ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్, భూపాలపల్లికి ఆక్సిజన్ ప్లాంటు, మెడికల్ రీజినల్ సబ్సెంటర్ మంజూరు చేశారని అన్నారు. ములుగు దవాఖానను పైలట్ ప్రాజెక్టు కింద ఎంచుకున్నందుకు గాంధీ మెడికల్ కళాశాల పూర్వవిద్యార్థుల్లో సభ్యుడైన డాక్టర్ శ్యాంసుందర్ ములుగు జడ్పీచైర్మన్ అభినందనలు తెలిపారు. భూపాలపల్లిలో జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభ, ఎంపీపీ మందల లావణ్య, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఆర్డీఓ శ్రీనివాస్, డీఎంహెచ్వో డాక్టర్ సుధార్సింగ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ జీడీ తిరుపతి, డీఎస్వో డాక్టర్ రవికుమార్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ మమత, టీఆర్ఎస్ అర్బన్, మండల అధ్యక్షుడు సాంబమూర్తి, మందల రవీందర్రెడ్డి, ములుగులో డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య, డీఎస్పీ కొత్త దేవేందర్రెడ్డి, డీడబ్ల్యూవో ప్రేమలత, డీపీఆర్వో ప్రేమలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, సీనియర్ నాయకుడు గోవింద్నాయక్ పాల్గొన్నారు.