కొవిడ్ నివారణకు పకడ్బందీగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు
వైరస్ను అరికట్టేందుకే లాక్డౌన్
జ్వర సర్వేతో పేదలకు ఎంతో మేలు
పాజిటివ్ వచ్చిన వారు ఆందోళన చెందొద్దు
108, 104 సేవలను వినియోగించుకోవాలి
డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
చిన్నగూడూరు, మే15 :కరోనా వైరస్ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్పష్టం చేశారు. చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలోని తన నివాసంలో శనివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వైరస్ నియంత్రణ, ప్రజలకు వైద్యసేవల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బం దీ చర్యలు చేపడుతున్నారని చెప్పారు. వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు మన రాష్ట్రంలోనే బాగున్నాయని చెప్పారు. ఇంటింటికీ జ్వర సర్వే కార్యక్రమంతో ముఖ్యంగా పేదలకు ఎంతో మేలు జరిగిందని చెప్పా రు. ప్రభుత్వ బృందాలు ప్రతి ఇంటికీ వెళ్లి అందరి ఆరోగ్య వివరాలను సేకరించడం మంచి కార్యక్రమమన్నారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ ఈ బృందాలు వెళ్లాయని, దీని వల్ల ఎవరి ఆరోగ్య పరిస్థితి ఏమిటనేది తెలిసిందని చెప్పారు. కరోనా లక్షణాలు ఏ కొంచెం ఉన్నా ప్రభుత్వం ఉచితంగా మందులు అందించిందని, దీని వల్ల ఎవరికీ తీవ్రస్థాయి సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పారు. ఇంటింటికీ సర్వే వల్ల వైరస్ వ్యాప్తి త్వరగా నియంత్రణలోకి వస్తుందన్నారు. ఇంటింటా జ్వర సర్వేలో భాగంగా ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు గొప్పగా సేవలందిస్తున్నారని కొనియాడారు.
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, అవసరమైన మందులు, వ్యాక్సిన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ర్టానికి ఎలాంటి సహకారం అందించడంలేదని చెప్పారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ అనేది గొప్ప విషయమని చెప్పారు. వైరస్ నియంత్రణకు చివరి అస్త్రంగా సీఎం కేసీఆర్ లాక్డౌన్ అమలు చేశారన్నారు. చాలా కార్యకలాపాలకు ఇబ్బం ది అయినా లాక్డౌన్ నిబంధనలను అందరం పాటించాలని కోరారు. కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎప్పటిలాగే కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోందన్నారు. మన రాష్ట్రంలో పండిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేయడం గొప్ప విషయమని చెప్పారు. దేశంలో రైతులకు సాగునీరు, పెట్టుబడి, ఉచితంగా కరంటు ఇచ్చి మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని స్పష్టం చేశారు.
కరోనా నియంత్రణ కోసం అందరం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పనిసరి అయితేనే బయటికి వెళ్లాలని, బయటికి వెళ్తే మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. వైరస్ బారిన పడకుండా చూసుకోవడమే మంచిదని, అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా వచ్చిన వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తోందని, వాటిని వేసుకుంటే త్వరగా కోలుకుంటారని చెప్పారు. అసవరమైన వారు డాక్టర్లను సంపద్రించి మెరుగైన వైద్యం పొందాలన్నారు. 108, 104 సర్వీసులకు ఫోన్ చేస్తే వేగంగా హాస్పిటల్కు చేరవచ్చని, ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.