తెల్లబంగారం వైపు రైతన్న మొగ్గు
ఉమ్మడి జిల్లాలో 9.08 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
ఈ సారి భారీగా పెరుగనున్న విస్తీర్ణం
గతేడాదికంటే లక్షన్నర ఎకరాలు అధికం
వరంగల్, జూన్ 10 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : వరంగల్ ఉమ్మ డి జిల్లాలో పత్తి సాగు యేటేటా పెరుగుతున్నది. గతేడాదితో పోలిస్తే ఈ సారి మరో 1.50లక్షల ఎకరాల్లో అదనంగా సాగయ్యే అవకాశం ఉన్నది. మొత్తం 9.08లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. వానకాలం మొదలు కావడంతో రైతులు సాగు ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. సాగునీరు పుష్కలంగా ఉండడంతో మెజార్టీ రైతులు వరికే మొగ్గు చూపుతున్నారు. వరిత తర్వాత రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో ప్రధాన పంటగా పత్తి ఉండగా ఈ సారి కూడా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు పత్తి సాగుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 9.08లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగయ్యేలా ప్రణాళికలు రూపొందించారు.
అనువైన నేలలు..
ఉమ్మడి జిల్లాలో అధిక శాతం భూములు పత్తి సాగుకు అనుకూలంగా ఉంటాయి. దీంతో ఈ పంట సాగు విస్తీర్ణం యేటా పెరుగుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఎకరాకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. బీడు భూముల్లోనూ పంటలు పండుతున్నాయి. మెట్ట భూముల్లో ఎక్కువమంది రైతులు పత్తి పండిస్తున్నారు. ఆరుతడి పంట కావడంతో వానలతోనే పంట చేతికొస్తుంది. కొద్దిగా అవసరం ఉన్నా నీటి వసతికి ఇబ్బంది లేదు. మిగిలిన పంటలతో పోలిస్తే పెట్టుబడి తక్కువ. ముఖ్యంగా కూలీల ఇబ్బందీ తక్కువే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరుల మేరకు పురుగుమందులు, కలుపు వంటి సమస్యలు ఈ పంటలోనే తక్కువ ఉంటున్నాయి. పత్తి వేసే సమయంలోనే కూలీల అవసరం ఉంటుంది.
అంతర్జాతీయంగా ఉండే డిమాండ్తో మూడేండ్లుగా పత్తికి కనీస మద్దతు ధర వస్తున్నది. ఈ పరిస్థితులతో ఉమ్మడి జిల్లాలో పత్తిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. 2019లో ఉమ్మడి జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేదిడాది విస్తీర్ణం 7.59 లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రస్తుత సీజన్లో 9.08 లక్షల ఎకరాలకు అనుగుణంగా పత్తి సాగు ప్రణాళిక సిద్ధమైంది. తెలంగాణ పత్తి నాణ్యమైనది కావడంతో మార్కెట్లో డిమాండ్ సైతం ఎక్కువే ఉంటున్నది. ప్రస్తుతం పత్తి ధర క్వింటాలుకు రూ.7వేలు పలుకుతుండగా సాగు పెరిగేందుకు ధర కూడా కారణమవుతున్నది.