ఊరూరా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం
కేంద్రాల్లో సకల వసతులు
ప్రతి సెంటర్లో కుర్చీలు, తాగునీరు, నీడ కోసం టెంట్లు
అందుబాటులో టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమకొలిచే యంత్రాలు
ఊరికో ప్రత్యేక పర్యవేక్షణాధికారి
వెంటవెంటనే మిల్లులకు ధాన్యం తరలింపు
ఇబ్బందుల్లేకుండా వడ్లు అమ్ముకుంటున్న రైతులు
రెండు, మూడు రోజుల్లోనే ఖాతాల్లో డబ్బు జమ
కరోనా కష్టకాలంలో అండగా ప్రభుత్వం
సర్కారు ‘మద్దతు’పై అన్నదాతల్లో సంబురం
వరంగల్ రూరల్, మే 10 (నమస్తే తెలంగాణ) : వరంగల్ రూరల్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ఉద్యమంలా సాగుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం 33,566 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు రూ 63.31 కోట్లు. కరోనా నేపథ్యంలో రైతుల నుంచి నేరుగా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాలో అనూహ్యంగా 204 కేంద్రాల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. వీటిలో పీఏసీఎస్లకు 123, ఐకేపీకి 56, జీసీసీకి 1, ఏఎంసీలకు 6, ఇతరులకు 18 కేంద్రాలు కేటాయించింది. ఇటీవల వరి కోతలు ప్రారంభం కావడంతో నిర్వాహకులు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం వరకు 149 సెంటర్లను ప్రారంభించారు. వీటిలో 113 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు 33,566 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నట్లు అధికారులు వెల్లడించారు. 1,821 మంది రైతుల నుంచి ఈ ధాన్యం సేకరించినట్లు ప్రకటించారు. ప్రస్తుత యాసంగిలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులు, గన్నీ సంచులు సమకూర్చింది. కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్ ఎం హరిత వివిధ శాఖల అధికారులతో పలుమార్లు సమావేశమై పక్కా ప్రణాళిక రూపొందించారు. ప్రతి సెంటర్కు, మండలానికి ప్రత్యేక అధికారిని నియమించారు. కూపన్ల పంపిణీ బాధ్యతలను వ్యవసాయ విస్తరణ అధికారుల (వీఏవో)కు అప్పగించారు. అదనపు కలెక్టర్ హరిసింగ్, మండల ప్రత్యేకాధికారులు కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు.
కేంద్రాల్లో మౌలిక వసతులు
ప్రతి కేంద్రం వద్ద టెంటు, కుర్చీలు, తాగునీరు, గన్నీ సంచులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్, తేమ కొలిచే యంత్రం ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకునేందుకు నీరు, సబ్బు, శానిటైజర్ అందుబాటులో ఉంచారు. రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాలో ఏడు సెక్టార్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రైస్మిల్లులకు రవాణా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు జారీ చేసిన ట్రక్షీట్లపై రైస్మిల్లర్లు సంతకం చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతున్నది. ట్రక్షీట్ల ప్రకారం పౌరసరఫరాల సంస్థ అధికారులు రైతులకు చెల్లింపులు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు సొంత ఊరిలోనే ధాన్యం అమ్ముకునే అవకాశంతో కలిగడంతో పాటు మద్దతు ధర దక్కుతున్నది. ఇటు హమాలీలకూ ఉపాధి లభిస్తున్నది. రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, నెక్కొండ, సంగెం, గీసుగొండ, దామెర, ఆత్మకూరు, శాయంపేట, పరకాల, నడికూడ, ఖానాపురం మండలాల్లో కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో వరికోతలు ఇప్పుడిప్పుడే మొదలు కావడంతో కొనుగోళ్లు ప్రారంభ దశలో ఉన్నాయి.
జనగామ జిల్లాలో
జనగామ, మే 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో 1,59,843 ఎకరాల్లో యాసంగి వరి సాగు కాగా, 2.96లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 195 కేంద్రాల ద్వారా 2.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు రూ.105కోట్ల విలువైన 56వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.45కోట్ల మేర చెల్లింపులు చేశారు. రైతులకు ముందుగానే టోకెన్లు పంపిణీ చేసి రోజుకు 50 మంది నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. కనీస మద్ధతు ధర గ్రేడ్-ఏ రకం క్వింటాల్కు 1888, సాధారణ రకానికి రూ.1868 చొప్పున చెల్లిస్తున్నారు. 56వేల మెట్రిక్ టన్నుల్లో 11,381 మెట్రిక్ టన్నులను సీఎంఆర్ కోసం రైస్ మిల్లులకు తరలించారు. మరో మూడు రోజుల్లో మిగతా చెల్లింపులు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలతో పాటు జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనూ కరోనా కష్టకాలంలో రైతులకు ఇబ్బందుల్లేకుండా సజావుగా కొనుగోళ్లు చేస్తున్నారు. దిగుబడులకు తగినట్లుగా 71లక్షల గన్నీ బ్యాగులు నిల్వ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 20లక్షల గన్నీలు అందుబాటులో ఉండగా మిగతావి కోల్కతా, గుంటూరు, ఏలూరు, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. కొనుగోళ్ల కోసం 636 కల్లాలు, 4,598 టార్పాలిన్లు, 203 ఎలక్ట్రానిక్ కాంటాలు, 198 తేమ కొలిచే యంత్రాలు, 36 ప్యాడీ క్లీనర్లు సహా ధాన్యం నిల్వల కోసం 35 రైస్ మిల్లులు, ఐదు గోదాములు వినియోగిస్తున్నారు. హమాలీలు, వాహనాల కొరతతో రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ కే నిఖిల పలుమార్లు సమీక్షించి ధాన్యం తరలింపులో సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం గ్రామానికో అధికారిని ఇన్చార్జిగా నియమించారు. ఎండల తీవ్రత దృష్ట్యా తడకల పందిళ్లు వేసి తాగునీరు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచారు.
మహబూబాబాద్ జిల్లాలో
47,747 మెట్రిక్ టన్నుల సేకరణ
రైతుల ఖాతాల్లో రూ.19 కోట్లు జమ
మహబూబాబాద్, మే10 (నమస్తే తెలంగాణ) : మానుకోట జిల్లాలోని 16మండలాల్లో మొత్తం 167 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఐకేపీ-51, పీఏసీఎస్-101, మార్కెటింగ్శాఖ-8, జీసీసీ- 5, మెప్మా ఆధ్వర్యంలో రెండు కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 152 సెంటర్లను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 4,23,786 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు 47,747 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 3,188 మంది రైతులకు చెందిన 18వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ట్యాబ్లో నమోదు చేశారు. 1,772 మంది రైతులకు చెందిన 10,017 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి డబ్బును ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటివరకు రూ.19కోట్ల మేరకు చెల్లింపులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ధాన్యం అమ్మిన అనంతరం ట్యాబ్లో రైతుల వివరాలు నమోదు చేసిన తర్వాత 48గంటల్లోగా ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలిస్తున్నారు. ధాన్యం తరలింపుకోసం 16మండలాలను ఆరు సెక్టార్లుగా విభజించారు. మొదటి సెక్టార్లో మహబూబాబాద్, కురవి, రెండో సెక్టార్లో బయ్యారం, గార్ల, డోర్నకల్, మూడో సెక్టార్లో నెల్లికుదురు, దంతాలపల్లి, నర్సింహులపేట, నాలుగో సెక్టార్లో తొర్రూరు, పెద్దవంగర, ఐదో సెక్టార్లో మరిపెడ, చిన్నగూడురు, కురవి, ఆరో సెక్టార్లో గూడురు, కొత్తగూడ, గంగారం మండలాలున్నాయి. కేవలం 48 గంటల్లోగా ఖాతాలో ధాన్యం డబ్బు పడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అర్బన్ జిల్లాలో
3.63లక్షల క్వింటాళ్ల సేకరణ
విలువ రూ.71.42కోట్లు
సుబేదారి, మే10 : వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం 105కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సహకార శాఖ తరఫున 68 కేంద్రాలు, ఐకేపీ నుంచి 35 కేంద్రాలను ప్రారంభించింది. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో డీసీవో, డీఆర్డీవో, సివిల్ సప్లయీస్, అగ్రికల్చర్ అధికారులతో వేసిన కమిటీ కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది. సహకార శాఖ నుంచి జిల్లాలోని ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, ఖిలావరంగల్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాల్లో మొత్తం 68 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్లో టెంట్లు వేశారు. తాగునీటి వసతి, రాత్రివేళ లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ఆదివారం వరకు సహకార కేంద్రాల నుంచి 2,52,373 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. దీని విలువ రూ.50,69,81,920 కాగా 60శాతం రైతులకు చెల్లించినట్లు జిల్లా సహకార శాఖ అధికారి నాగేశ్వర్రావు తెలిపారు. లక్ష,73,97 క్వింటాళ్ల ధాన్యం మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. ఇక ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35 సెంటర్లను ద్వారా లక్ష, 9,846 క్వింటాళ్ల ధాన్యం కొన్నారు. దీని విలువ రూ.20,72,68,795 కాగా, ఇప్పటి వరకు లక్షా5వేల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించి ఐదు శాతం డబ్బు రైతులకు చెల్లించినట్లు డీఆర్డీవో శ్రీనివాస్కుమార్ తెలిపారు.
భూపాలపల్లి జిల్లాలో
4500 మెట్రిక్ టన్నుల సేకరణ
రూ.45లక్షల మేర చెల్లింపులు
జయశంకర్ భూపాలపల్లి, మే 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని 11 మండలాల పరిధిలో సుమారు 76 వేల ఎకరాల్లో యాసంగి వరి సాగైనట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. సుమారు 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 206 కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయాలని నిర్ణయించి ఇప్పటి వరకు 130 సెంటర్లను ప్రారంభించి కొనుగోళ్లు ముమ్మరం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 323 మంది రైతుల నుంచి 4,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రూ.45లక్షల మేర చెల్లింపులు చేశారు. మొత్తం 1.80లక్షల మెట్రిక్ టన్నుల్లో 50 లక్షల మెట్రిక్ టన్నులు మేల్, ఫీమేల్ రకం ధాన్యం పోను 1,30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ధాన్యం విక్రయించి ట్యాబ్లో న మోదైన రెండు, మూడు రోజుల్లోనే రై తుల ఖాతాల్లో డబ్బు జమచేస్తున్నారు.