కరోనా బాధితులకు అన్నీ తానైన పారిశుధ్య కార్మికుడు
తాగునీటి నుంచి మందుల దాకా పంపిణీ
వైరస్ మృతులకు అంత్యక్రియలు కూడా
ఎవరైనా ఆపదొస్తే రామచంద్రా అని దేవుడిని తలుచుకుంటాం. కడవెండిలో ఎవరికైనా కరోనా వస్తే పారిశుధ్య కార్మికుడు పడమటింటి రామచంద్రునే తలుస్తారు. యేడాది కాలంగా బాధితులకు సేవలందిస్తున్నాడు. గ్రామంలో ఏ వ్యక్తికి కరోనా వచ్చినా మొదటగా మందలించేది రామచంద్రే. బాధితుడి ఇంట్లో శానిటైజ్ చేసి ఏం భయపడకు.. నేనున్నాను.. అంటూ భరోసా ఇస్తాడు. ప్రతి రోజూ రెండు సార్లు వైరస్ సోకిన వారి ఇంటికి వెళ్లి మినరల్ వాటర్, సర్పంచ్ అందించే గుడ్లు, పాలు, కూరగాయలు ఇచ్చి యోగక్షేమాలు తెలుసుకుంటాడు. మందులు అయిపోతే ఆశ కార్యకర్తకు చెప్పి తెచ్చివ్వడం అతని పనే. ఏ ఆపద వచ్చినా ఫోన్ చేయమని, క్షణాల్లో మీ ముందట ఉంటానని కరోనా బాధితులకు ధైర్యం చెబుతాడు. గ్రామంలో ఎవరైనా కరోనాతో చనిపోతే మృతదేహాన్ని గ్రామపంచాయతీ ట్రాక్టర్లో తరలించి దహన సంస్కారాలు నిర్వహిస్తాడు. గ్రామపంచాయతీలో ఇద్దరు పారిశుధ్య కార్మికులు ఉండగా, మరో కార్మికుడు వైరస్కు భయపడుతుండడంతో సేవ చేయడం రామచంద్రు వంతైంది.
రెండు డోసుల టీకా ఏసుకున్న..
ఇంట్ల కరోనా రోగుల ఇండ్లకు ఎందుకు పోతున్నవని తిడుతరు. వారి మాట ఇన. భయపడ. పాపం ఎవరైనా సస్తుంటె చూస్తమా. మాయదారి రోగం వచ్చింది. అది ఊరంత పాకుతుంది. ఇంటోల్లే భయపడుతున్నరు. ఎవరో ఒకరు ఆదుకోవాలెగద. అలవాటయింది. కరోనా టీకాలు రెండు డోసులు ఏసుకున్న. ఇగ నాకేమైతది. మా సర్పంచ్ అవేసుకుంటె కరోనా రాదని చెప్పింది. నాకు కిందిమీదికి అంగిలాగు లిచ్చిండ్రు. ఉదయం 6 గంటలకు మొదలు పెడితె రాత్రి వరకు పనులు జూసుకోవాలె. వీధులల్ల ఊడ్చుడు, మోరీలు తీసుడు, కరోనా వచ్చినోళ్లను చూసుకునుడు నా పని. ముగ్గురు కరోనాతో చనిపోతే దానం చేసినం.
రామచంద్రు, పారిశుధ్య కార్మికుడు, కడవెండి