చర్లపల్లికి భిన్నంగా అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు
రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది వెల్లడి..
ఖైదీలు, మిషనరీ తరలింపు తీరు పరిశీలన
పోచమ్మమైదాన్, జూన్ 7 : మామునూరులో అత్యాధునిక సదుపాయాలతో కొత్త సెంట్రల్ జైలును ఏర్పాటు కానున్నట్లు రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది తెలిపారు. సుమారు రూ.250 కోట్లతో వంద ఎకరాల స్థలంలో నిర్మించేలా ప్రతిపాదన సిద్ధం చేయనున్నట్లు ఆయన చెప్పారు. సోమవారం ఆయన ప్రస్తుత సెంట్రల్ జైలు నుంచి ఖైదీలు, మిషనరీ తరలింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. చర్లపల్లి జైలుకు భిన్నంగా అధునాతన సదుపాయాలతో సెంట్రల్ జైలును మామునూరు సమీపంలోని బెటాలియన్లో ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, ఇప్పటికే రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖైదీల తరలింపు పూర్తి కావొచ్చందని, రెండు, మూడు రోజుల్లో మొత్తం ఖాళీ చేస్తామని చెప్పారు. ఐజీ రాజేశ్కుమార్, సూపరింటెండెంట్ సంతోష్కుమార్ రాయ్, ఇతర అధికారుల పర్యవేక్షణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరలింపు ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్నదన్నారు. రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, ఆర్అండ్బీ, పరిశ్రమల శాఖల సహకారంతో శరవేగంగా పూర్తవుతున్నదని తెలిపారు. ఇప్పటివరకు 80శాతం మంది నేరస్తులతో పాటు ఖైదీలను ఇతర జైళ్లకు తరలించామని, మిగతా 231 మందిని మూడు రోజుల్లో పంపిస్తామని వివరించారు.
రిమాండ్ ఖైదీలను మహబూబాబాద్, ఖమ్మం జైలుకు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పలు జైళ్లల్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు రూ.5 కోట్లు మంజూరయ్యాయని, ఈ పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కాగా, వరంగల్ సెంట్రల్ జైలు పరిధిలోని పెట్రోల్ బంక్లపై ప్రజలకు నమ్మకం ఉందని, ఇందులో పనిచేస్తున్న 50 మంది ఓపెన్ ఎయిర్ ఖైదీలకు ప్రత్యేక జైలు ఏర్పాటు చేసి ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన స్పష్టంచేశారు. సెంట్రల్ జైలులో పనిచేస్తున్న వివిధ విభాగాల అధికారులు, ఇతర సిబ్బంది విషయమై అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కారాగారంలోని మిషనరీ తరలింపు 75శాతం పూర్తయిందని, పవర్లూమ్స్ను చరపల్లికి, స్టీల్ ఫర్నిచర్ను కరీంనగర్కు, ప్రింటింగ్ మెటీరియల్ను నిజామాబాద్ జిల్లా జైళ్లకు చేరవేసినట్లు సూపరింటెండెంట్ సంతోష్కుమార్ రాయ్ తెలిపారు.
మూడు రోజుల్లో కారాగారం ఖాళీ
వరంగల్ కేంద్ర కారాగారం రెండు, మూడు రోజుల్లో ఖాళీ కానుంది. ఈమేరకు యుద్ధప్రాతిపదికన ఖైదీలతో పాటు సామగ్రి తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. సెంట్రల్ జైలు స్థలంలో సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించనున్న నేపథ్యంలో ఈ నెల 1వ తేదీ నుంచి తరలింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 679మందికి ఇతర జైళ్లకు పంపారు. 1న 114 మందిని చర్లపల్లి, చంచల్గూడకు, 2న 50 మందిని చంచల్గూడకు, 3న 109మందిని నిజామాబాద్, ఆదిలాబాద్ జైళ్లకు, 4న 153 మందిని చర్లపల్లి, చంచల్గూడకు, 5న 148 మందిని నిజామాబాద్, ఖమ్మం జైళ్లకు, 6న 105 మంది ఖైదీలను ఖమ్మం, మహబూబాబాద్, చర్లపల్లి, ఆసిఫాబాద్ జైళ్లకు తరలించారు. మిగిలిన ఖైదీలను రెండు, మూడు రోజుల్లో ఇతర జైళ్లకు తరలించి, జైలు మొత్తాన్ని ఖాళీ చేయనున్నారు. అక్కడ జైళ్లల్లో ఉన్న ఖైదీల నైపుణ్యం, పనితీరును పరిశ్రమలను ఏర్పాటు చేసి, వరంగల్ మాదిరిగానే ఉత్పత్తులు కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. తరలింపు తీరుపై డీజీ త్రివేది సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నెల 15 వరకు ఆరోగ్యశాఖకు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్ సెంట్రల్ కొత్త భవన సముదాయం, సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ ఒకేరోజు శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.