కొత్తదారిలో థర్డ్జెండర్ల జీవనం
భిక్షాటన నుంచి స్వయంఉపాధిదిశగా పయనం
గ్రేటర్ కమిషనర్ సత్పతి చొరవతో ఎస్హెచ్జీల ఏర్పాటు
గ్రేటర్ ద్వారా రుణాలు, ఒక జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభం
ఇది దేశంలోనే మొదటిసారి
పబ్లిక్ టాయిలెట్లు, నర్సరీలనిర్వహణ బాధ్యతలు
వరంగల్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ట్రాన్స్జెండర్ల భిక్షాటన వీడి తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. చదువు, నైపుణ్యం ఆధారంగా ట్రాన్స్జెండర్లకు సొంతంగా ఉపాధి కల్పించేలా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ప్రధాన రైల్వే మార్గం కావడంతో నగరంలో మొదటినుంచీ ట్రాన్స్జెండర్ల సంఖ్య ఎక్కువే. సుమారు 400మంది దాకా ఉంటారు. రైళ్లలో అడుక్కోవడంతోనే వీరికి పూట గడిచేది. పుట్టుకతోనే ఇబ్బంది పడే వీరికి భిక్షాటనతో ఇతరులు వీరిని తక్కువగా చూసే పరిస్థితి ఉండేది. మహమ్మారి కరోనాతో ఈ భిక్షాటన ఆసరా కూడా పోయింది. రైళ్లు లేవు, బస్సులు లేవు, జనం బయటికి వచ్చే అవకాశం లేదు. పూట గడిచేందుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇదే సందర్భంలో వరంగల్లోని ట్రాన్స్జెండర్లు కొందరు తమ దగ్గర ఉన్న డబ్బులతో ఇతరులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
నిత్యావసర సరుకులను పంపిణీ చేసే కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చారు. అప్పుడు ట్రాన్స్జెండర్ల పరిస్థితిని తెలుసుకున్నారు. కరోనా ఎప్పటికి ముగుస్తుందో తెలియని అయోమయ స్థితిలో ట్రాన్స్జెండర్లకు స్వయంఉపాధి కల్పిస్తే బాగుంటుందని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా వరంగల్లోని ట్రాన్స్జెండర్లతో స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు చేయించారు. ఇలా ఇప్పటివరకు 13 ఎస్హెచ్జీలు ఏర్పాటయ్యాయి. వచ్చే నెలలో మరో రెండు ఏర్పాటుకానుండడంతో 15 సంఘాలకు కలిపి ఒక రిసోర్స్ పర్సన్(ఆర్పీ)ను నియమిస్తారు. సొంత ఉపాధి కల్పనపై వీరికి నిత్యం అవగాహన కల్పించేలా ఆర్పీ పనిచేస్తారు.
మొదట లౌక్యం ట్రాన్స్జెండర్ స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో వరంగల్ బస్టాండ్కు ఎదురుగా ఉన్న గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంప్లెక్స్లో జెనరిక్ మందుల షాపును ఏర్పాటుచేయించారు. బీఎస్సీ నర్సింగ్ చదివిన సిరి ఈ షాపు నిర్వహిస్తోంది. ఈ షాపు కోసం రూ.2.50 లక్షలను సంఘానికి రుణం మంజూరైంది.
మరో స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో హన్మకొండలోని దీన్దయాల్నగర్లో పబ్లిక్ టాయిలెట్లను నిర్వహిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన ఈ పబ్లిక్ టాయిలెట్ను ప్రియాంక ట్రాన్స్జెండర్ స్వయం సహాయక సంఘం తరఫున ట్రాన్స్జెండర్ షాలినీ నిర్వహిస్తోంది. దీని నిర్వహణ కోసం కార్పొరేషన్ ప్రతి నెలా రూ.16వేల చొప్పున చెల్లిస్తోంది. అలాగే న ర్సరీ నిర్వహణలోనూ ట్రాన్స్జెండర్లకు శిక్షణ ఇచ్చా రు. గ్రేటర్లో నాటేందుకు అవసరమైన మొ క్కల పెంపకాన్ని ట్రాన్స్జెండర్ల సంఘం ఆధ్యర్యంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మాకు గౌరవం దక్కింది..
ట్రాన్స్ జెండర్లు అంటేనే అందిరిలో ఒక రకమైన అభిప్రాయం. ఉపాధి మార్గాలు లేక మేం కూడా ఈజీ మని కోసమే ప్రయత్నించే వాళ్లం. మహిళలు, పురుషుల కంటే మాకు అవసరాలు ఎక్కువ ఉంటాయి. డబ్బు అవసరం ఎక్కువ ఉంటుంది. దీని కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కరోనాతో మా పరిస్థితి మారింది. అప్పుడు వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి మాకు కొత్తదారి చూపారు. వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ మాకు అండగా నిలిచింది. నేను బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశా. మా వాళ్లకు, చుట్టుపక్కల వాళ్లకు వైద్యం సాయం చేసేదాన్ని. ఇప్పుడు నేను ఒక షాపును నిర్వహించ డం గొప్ప అనుభూతి కలిగిస్తోంది. అందరు గౌ రవంగా చూస్తున్నారు. 18 ఏండ్లుగా ఎన్నో కష్టాలను చూశా. ఇన్నేండ్లుగా నేను కోరుకున్నది ఇదే.
ఓరుగంటి సిరి, లౌక్యం జనరిక్ మందుల షాపు, వరంగల్