ములుగు ఎస్పీ సంగ్రామ్సింగ్జీ పాటిల్ వెల్లడి
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలువాలని పిలుపు
ములుగు, జూన్ 4 (నమస్తేతెలంగాణ) : మావోయిస్టు స్పెషల్ గెరిల్లా దళ సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామెడు మండలం కౌరుగుట్ట గ్రామానికి చెందిన మడకం నందాల్ అలియాస్ నందు స్పెషల్ గెరిల్లా దళానికి చెందిన వాడని తెలిపారు. ఇతడు చిన్నతనంలో ఉన్నప్పుడే తల్లి మరణించింది. అనంతరం మావోయిస్టు అనుబంధ సంస్థ బాలల సంఘంలో నందాల్ మూడు సంవత్సరాలు పని చేశాడని ఎస్పీ తెలిపారు.
ఇతడిని తండ్రి కొట్టడంతో బంధువు సహాయంతో గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలోని గుండ్లవాగు ప్రాజెక్టులో పనిచేస్తూ బూడిద గడ్డ గొత్తికోయ గుంపులో ఉండేవాడన్నారు. అనంతరం ఛత్తీస్గఢ్లో సోముడు అనే మావోయిస్టు ద్వారా 2018లో చర్ల అరుణక్క దళంలో దళ సభ్యుడిగా చేరి సంవత్సరం పనిచేశాడని వివరించారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు అజాద్ ఆదేశాల మేరకు మణుగూరు దళంలో స్పెషల్ గెరిల్లా స్కాడ్ లచ్చన్నకు గార్డుగా పనిచేశాడని వెల్లడించారు. ఆ సమయంలో బట్టుమ్ ఫైరింగ్, పెద్దమిడిసిలేరు రోడ్ బ్లాస్టింగ్లో, జెర్రం ఏరియా టేకులగూడెం వద్ద జరిగిన కాల్పుల్లో 24 మంది సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ చనిపోయిన సంఘటనలో నందాల్ పాల్గొన్నాడని ఎస్పీ వివరించారు. అనారోగ్య సమస్యతో మావోయిస్టు పార్టీని వీడాలని నిర్ణయించుకుని లొంగిపోయాడని ఆయన తెలిపారు. లొంగిపోవడానికి గల కారణాలపై నందాల్ను ప్రశ్నించగా అనేక మంది మావోయిస్టులు కరోనాతో బాధపడుతున్నారని, మావోయిస్టు పార్టీ సరైన వైద్యం అందించకపోవడంతో చాలా మంది యూజీ క్యాడర్ మావోయిస్టులు మరణించారని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికైనా మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలువాలని పిలుపునిచ్చారు. అనంతరం నందాల్కు ఎస్పీ ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ శోభన్కుమార్, ఏఎస్పీలు పోతరాజు సాయిచైతన్య, చెన్నూరి రూపేష్ పాల్గొన్నారు.