సర్కారు ఊతం..కలిసొస్తున్న కాలం..
ఈ వానకాలం అంచనా 17.20లక్షల ఎకరాలు
ప్రణాళికలు రూపొందించిన వ్యవసాయ శాఖ
గతేడాది 16.45లక్షలఎకరాల్లో సాగు
ప్రభుత్వ కృషితో ఏటా పెరుగుతున్న విస్తీర్ణం
ఆరు జిల్లాల్లోనూ ఇదే తీరు
వరంగల్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వ్యవసాయ రంగంలో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాగునీరు, నిరంతర ఉచిత కరంటు, ‘రైతు బంధు’ పెట్టుబడి సాయంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానకాలంలో పంట విస్తీర్ణం ఏటేటా అంచనాలకు మించి పెరుగుతున్నది. ప్రస్తుత వానకాలం సీజన్కు గతేడాది విస్తీర్ణం ఆధారంగా సాగు అంచనాలను వ్యవసాయ శాఖ రూపొందించింది.
ఆరు జిల్లాల్లో కలిపి గత వానకాలంలో 16.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా ఈ సారి 17.20లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసింది. ఈ లెక్కన గతేడాది కంటే సాగు విస్తీర్ణం 75వేల ఎకరాలు అధికం. పెరుగుతున్న విస్తీర్ణానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. సరిపడా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. ప్రధాన పంటలైన వరి, పత్తి, కంది, పెసర, మినుము, పల్లి, కూరగాయల విత్తనాలను అందుబాటులో ఉంచింది. ప్రధాన పంట లు సాగు చేసే ముందు భూసారం పెంచేందుకు అవసరమైన జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను రైతులకు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు విత్తనాలను అమ్ముతున్నది. పత్తి, కంది, పెసర, మినుము, పల్లి పంటల సాగు విస్తీర్ణం పెరిగేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
రోహిణిలోనే నారు
వ్యవసాయ రంగం అభ్యన్నతి, అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో మళ్లీ పాత రోజులు వచ్చాయి. మూడునాలుగు దశాబ్దాల క్రితం వరకు వానకాలం మొదలయ్యే జూన్ నుంచే పంటల సాగుకు పనులు జోరందుకునేవి. రోహిణి కార్తెలోనే వరి నార్లు పోసేవారు. దీని వల్ల పూర్తి స్థాయిలో వానలు మొదలయ్యే జూలైలోనే నాట్లు పూర్తయ్యేవి. వర్షాధారంతోనే పంటల సాగయ్యేవి. ఇప్పుడు సాగునీరు పుష్కలంగా ఉంది. ప్రతి చెరువు, కుంట, బాయి.. ఎక్కడైనా నిండుగా నీళ్లున్నాయి. నిరంతరం ఉచిత కరంటు వస్తున్నది. దీనికితోడు రైతులకు అవసరమైన పెట్టుబడి ఖర్చుల కోసం ప్రభుత్వం అందించే ‘రైతుబంధు’ సాయం ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో పడనుంది. ఇలా సాగుకు అవసరమైన నీరు, కరంటు, పెట్టుబడి సాయంతో రైతుల్లో ధీమా ఉంది. ప్రభు త్వం చేసిన ఏర్పాట్లతో విత్తనాలు, ఎరువులు అం దుబాటులో ఉన్నాయి.
ఇలా సాగుకు అవసరమైన అన్నీ సిద్ధంగా ఉండడంతో వానకాలం పంటల సాగు త్వరగా మొదలవుతున్నది. రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు మొదలయ్యాయి. తొలకరితో రైతులు పల్లి, పెసర, మిను ము, మక్క విత్తనాలు వేస్తున్నారు. నారు మడులను సిద్ధం చేసి మొలక అలుకుతున్నారు. వానకా లం పంటల సాగు విస్తీర్ణం వ్యవసాయ శాఖ అంచనాల కంటే పెరిగే పరిస్థితి కనిపిస్తున్నది. గతేడాదీ ఇలాగే జరిగింది. గత వానకాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. అంచనాలకు కంటే 1.21 లక్షల ఎకరాల్లో అదనంగా సాగైంది. ఈ ఏడాది కూడా ఇలాగే సాగు విస్తీర్ణం భారీగా పెరిగే పరిస్థితి ఉంది.