ఇక ఇంటింటికీ ‘భగీరథ’ నీరు
ఉగాది నుంచి రోజూ ఇచ్చేందుకు సన్నాహాలు
నల్లాల బిగింపు ప్రక్రియ పూర్తి
ట్రయల్ రన్ చేస్తున్న అధికారులు
మిషన్ భగీరథ సింబాలిక్గా హంటర్ రోడ్డు జంక్షన్
వరంగల్, ఏప్రిల్ 2 : ఉగాది నుంచి గ్రేటర్ పరిధిలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ఫలాలు నగరవాసులకు అందేలా గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నెల రోజులుగా జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తూ తాగునీటి సరఫరా పనులను వేగవంతం చేశారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే ప్రక్రియ పూర్తి కావచ్చింది. కొత్తగా సుమారు లక్ష నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ప్రతి వీధికీ పైప్లైన్లు వేశారు. దాదాపుగా ప్రతి రోజూ నల్లాల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు పనులు పూర్తి చేశారు. ఇప్పటికే గ్రేటర్లో ఎక్కడ చూసినా మిషన్ భగీరథ పనులే కనిపిస్తున్నాయి. గ్రేటర్లోని దేశాయిపేట, కేయూ, వడ్డేపల్లి ఫిల్టర్బెడ్ల ఆధునీకరణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. కొత్త ఫిల్టర్ మీడియంలు, వాల్వ్ల ఏర్పాటు, మోటరు పంప్లకు మరమ్మతులు చేశారు. దీంతో పాటు ప్రతి రోజూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది నియామకాలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉగాది నుంచి ప్రతి ఇంటికీ నల్లా నీరు సరఫరా చేసేందుకు గ్రేటర్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రయల్ రన్ షురూ..
మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజూ నల్లాల ద్వారా తాగునీటి సరఫరాకు గ్రేటర్ అధికారులు ట్రయల్ రన్ మొదలు పెట్టారు. ఇందుకోసం గ్రేటర్ను నాలుగు జోన్లుగా విభజించారు. అండర్ రైల్వేగేట్, దేశాయిపేట, కేయూ, వడ్డేపల్లి జోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అండర్ రైల్వేగేట్ జోన్లో ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రస్తుతం ధర్మసాగర్ వాటర్ గ్రిడ్ నుంచి అండర్ రైల్వేగేట్ జోన్లో ప్రయోగాత్మకంగా తాగునీటి సరఫరా చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కేయూ ఫిల్టర్బెడ్ జోన్లో, శుక్రవారం వడ్డేపల్లి ఫిల్టర్బెడ్ జోన్లో ట్రయల్ రన్ మొదలు పెట్టారు. దేశాయిపేట జోన్లో సైతం ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ నెల 13 తేదీ ఉగాది నుంచి అధికారికంగా మిషన్ భగీరథ ద్వారా గ్రేటర్లోని ప్రతి ఇంటికీ నల్లానీరు సరఫరా చేస్తామని, పది రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించి 10 తేదీ నాటికి అంతా సిద్ధం చేస్తామని గ్రేటర్ ఇంజినీర్లు తెలిపారు. ట్రయల్ రన్లో బయటపడిన లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తామన్నారు. లీకేజీలను గుర్తించి వాటిని మరమ్మతులు చేపడుతామన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
మిషన్ భగీరథ సింబాలిక్ జంక్షన్..
మిషన్ భగీరథ పధకం సింబాలిక్ను నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్ ఎదురుగా అభివృద్ధి చేస్తున్న జంక్షన్లో మిషన్ భగీరథ పథకం సింబాలిక్గా పెద్ద ‘నల్లా’ను ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ ఫాల్ ఏర్పాటు చేశారు. మరో వారం రోజుల్లో ఈ పనులు పూర్తికానున్నాయి. ఇకపై హంటర్రోడ్డులో అభివృద్ధి చేస్తున్న జంక్షన్ను మిషన్ భగీరథ జంక్షన్గా పిలువనున్నారు.
ఇవి కూడా చూడండి..
వావ్.. వైద్య విద్యార్థుల సూపర్ డ్యాన్స్
సెకండ్ వేవ్.. ఏప్రిల్ 20 నాటికి గరిష్ట స్థాయికి కరోనా కేసులు