అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆపద సమయంలో డయల్ 100 కు కాల్ చేయాలి
ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్
ములుగు, జయశంకర్ భూపాలపల్లి పోలీస్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్
ములుగు, జూలై 22 (నమస్తే తెలంగాణ)/ భూపాలపల్లి : తుఫాన్ ప్రభావంతో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావొద్దని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ అన్నారు. ములుగులో ఎస్పీ కార్యాలయం నుంచి రెండు జిల్లాల పోలీస్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలను వరద ముంపు నుంచి తరలించేందుకు పోలీసులు సమాయత్తం కావాలన్నారు. ఇతర శాఖల అధికారులతో సమాచార మార్పిడి చేసుకొని సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గోదావరి నది ప్రవాహ తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ అత్యవసర సేవలకు పోలీసులు సిద్ధంగా ఉండాలని అన్నారు. చెరువులు, వాగుల వద్ద లోతు తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని అన్నారు. నీటి ప్రవాహాలను దాటే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఎవరూ ఉండొద్దని, సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు సురక్షిత ప్రదేశాల్లో నివసించాలని అన్నారు.
ప్రజలు వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కరంట్ స్తంభాల దగ్గరికి వెళ్లొద్దని సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్ట్ల నుంచి సుమారు ఆరు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వచ్చే అవకాశం ఉన్నందున, గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు, చేపల వేటకు వెళ్లే వారు నది వద్దకు వెళ్లవద్దని ఎస్పీ సూచించారు. గోదావరి , ప్రాణహిత, ఇంద్రావతి నదులు క్రమక్రమంగా పెరుగుతూ ప్రవహిస్తుండడంతో కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ ప్రదేశాల వద్దకు ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆపద సమయంలో డయల్ 100 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 7901628410కు సమాచారం ఇచ్చి పోలీసుల సహాయం పొందాలని అన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్దంగా ఉందని తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో ఏఎస్పీలు పోతరాజు సాయిచైతన్య, గౌస్ఆలం, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.