న్యూఢిల్లీ, జూలై 10: కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు తమను తాము చక్రవర్తుల్లా భావించుకోవద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. ప్రభుత్వాధికారులను ‘వెంటనే తమ ముందు హాజరు కావాలి’ అంటూ కొన్ని హైకోర్టుల న్యాయమూర్తులు ఆదేశించడంపై ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాధికారులు పదే పదే కోర్టుల చుట్టూ తిరిగితే కోర్టుల గౌరవం పెరగదని వారించింది. ఉన్నఫళంగా హాజరు కావాలంటే అధికారులు తమ విధులను విడిచిపెట్టి రావాల్సి ఉంటుందని పేర్కొన్నది.
ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించడమేనని తెలిపింది. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య ఉన్న అధికార విభజన రేఖను జడ్జిలు మీరవద్దని కోరింది. ఉత్తరాఖండ్కు చెందిన ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘కోర్టు అభిరుచులకు తగినట్టు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాధికారులపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మధ్య అధికారాల పరిధిని విభజించే రేఖను మీరినట్టే అవుతుంది’ అని పేర్కొన్నది. అధికారులు తీసుకొనే నిర్ణయాలు వారి సొంత ప్రయోజనాల కోసం కాదని గుర్తుంచుకోవాలని సూచించింది. ప్రభుత్వాధికారులను అనవసరంగా కోర్టులకు పిలవొద్దని, ఆ పద్ధతిని మానుకోవాలని కోరింది.