దిలావర్పూర్, జూలై 9 : తెలంగాణ సర్కారు చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. దిలావర్పూర్ మండలంలోని ఉత్తమ జీపీ బన్సపల్లి గ్రామాన్ని జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. సర్పంచ్, ఎంపీపీ, అధికారులు పూల మొక్క అందించి, స్వాగతం పలికారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో కలియతిరిగారు. అక్కడి నుంచి మోడల్ ఆరోగ్య సబ్సెంటర్ను పరిశీలించి, అభినందించారు. అనంతరం సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారులను అభినందించారు.
అక్కడి నుంచి రైతు వేదిక వద్ద మొక్కలు నాటి గ్రామస్తులతో కలిసి రెండు గంటలపాటు కార్యక్రమంలో పాల్గొని పల్లె ప్రగతి గురించి వివరించారు. ఆయన మాట్లాడు తూ.. ప్రతి కార్యక్రమంలో అధికారులతో పాటు గ్రామస్తులు సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు వస్తాయన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో పచ్చదనం పెరిగిందని, పారిశుధ్య సమస్య తీరిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 33 శాతం అడవులు అవసరమని, అందుకే సీఎం కేసీఆర్ హరితహారం ద్వారా మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టారన్నారు. పంచాయతీలకు నెలనెలా నిధులు మంజూరుచేస్తున్నామని, పనులు పారద్శకంగా సాగుతున్నాయని తెలిపారు. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జ డ్పీసీఈవో సుధీర్, విద్యుత్ శాఖ ఎస్ఈ చౌహాన్, సర్పంచ్ పద్మ, ఎంపీపీ ఏ లాల అమృత, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, ఎంపీడీవో మోహన్రెడ్డి, ఎంపీవో అజీజ్ఖాన్, పీఆర్డీఈ తుకారం, ఏఈ శివకృష్ణ, ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్, ఏవో స్రవంతి, ఈజీఎస్ ఏపీవో జగన్నాథం, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు ఏలాల చిన్నారెడ్డి, నాయకులు కిరణ్, ముత్యం, ఏఎన్ఎంలు పద్మ, అంగురీ, మహిళలు పాల్గొన్నారు.
త్వరలోనే రెట్టింపు వేతనం..
అనంతరం పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా బన్సపల్లిలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును సీఎం కేసీఆర్ గుర్తించారని, వేతనాలు త్వరలోనే రెట్టింపు అవుతాయన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, జిల్లా అధికారులు కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన అన్ని కార్యక్రమాలు ఇప్పటికీ నిర్మల్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయని అభినందించారు.