న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, రైతు సంఘాల నేతలు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీకేయూ నేత గుర్నామ్ సింగ్ చదౌని పిలుపు ఇవ్వడం పట్ల హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. రైతుల నిరసనల వెనుక రాజకీయం దాగుందని బీకేయూ నేత ప్రకటనతో స్పష్టమైందని ఖట్టర్ పేర్కొన్నారు. చదౌనీ రైతుల బాగోగుల పట్ల ఏమాత్రం శ్రద్ధ కనబరచడం లేదని, రైతుల నిరసనల వెనుక రాజకీయం ఉందని స్పష్టం చేశారు.
పంజాబ్ ఎన్నికల్లో రైతులు పోటీ చేయాలని బీకేయూ నేత అంటున్నారని..తాము కూడా రైతు నిరసనలను రాజకీయాలు వెనకుండి నడిపిస్తున్నాయనే చెబుతున్నామని వ్యాఖ్యానించారు. కాగా వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేపట్టిన రైతు సంఘాల నేతలు పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతూ బీకేయూ నేత చదౌని బుధవారం విడుదలైన వీడియో మెసేజ్లో కోరారు. బెంగాల్ ఎన్నికలను చూపుతూ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా బీజేపీ వ్యవసాయ చట్టాలను రద్దు చేయబోదని ఆయన చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యవస్ధను మార్చలేవని అన్నారు.