హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 18 ఏండ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తిచేసేందుకు వైద్యారోగ్యశాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నది. గురువారం నుంచి ఈ నెల 3వ తేదీవరకు ప్రత్యేకంగా టీకాలు వేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 940 ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే టీకాలు వేస్తామని స్పష్టంచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100 టీకా కేంద్రాలు ఏర్పాటుచేస్తామని, ఇతర నగరాలు, పట్టణాల్లో 204 కేంద్రాలు, అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 636 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుందని వివరించారు. కొవిషీల్డ్ మొదటి డోస్ వేసుకున్నవారికి రెండో డోస్ను 14 నుంచి 16 వారాల మధ్య వేస్తామని చెప్పారు.