నిజామాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాతో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని రైల్వేకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్లోని రైల్వే నిలయంలో జీఎంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైల్వే స్టేషన్లలో అసౌకర్యాలను రూపుమాపడం, మౌలిక సదుపాయాల కల్పనపై ఇరువురు చర్చించారు. ఎలిక్ట్రిఫికేషన్, రైల్వేస్టేషన్ల ఆధునీకరణతో పాటుగా నిజామాబాద్ ప్రజలకు ఉపయోగకరంగా రైళ్ల రాకపోకలను పెంచాలని గజానన్ మాల్యాకు సురేశ్రెడ్డి విన్నవించారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్లలో తాగునీరు సౌకర్యం కల్పించడంతో పాటు పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. సురేశ్రెడ్డి విన్నపాలపై రైల్వే జీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. కరోనా నుంచి పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో త్వరలోనే క్షేత్ర స్థాయి విజిట్కు రానున్నట్లు జనరల్ మేనేజర్ వెల్లడించినట్లు తెలిసింది.
మరోవైపు హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న ఆకార్ ఆశా దవాఖాన చేస్తున్న సామాజిక సేవకు రైల్వే సహకారాన్ని కోరారు. ఆకార్ ఆశా దవాఖాన కొన్నేండ్లుగా విధి వంచితులు, అగ్ని ప్రమాదాల్లో కాలిన గాయాలైన వారు, యాసిడ్ ప్రమాదాల్లో దెబ్బతిన్న వారందరికీ ఉచితంగా చికిత్స అందిస్తు
న్నది. ఈ సమాచారాన్ని రైల్వే స్టేషన్లలో, రైళ్ల ద్వారా ఉచిత ప్రచారానికి చొరవ తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాను ఆకార్ ఆశా దవాఖాన ప్రతినిధులు, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి కోరినట్లు సమాచారం. సామాజిక చైతన్యం కల్పించేందుకు తప్పకుండా రైల్వే శాఖ ద్వారా చర్యలు చేపట్టనున్నట్లు జీఎం వారికి హామీ ఇచ్చినట్లు ఎంపీ సురేశ్రెడ్డి వెల్లడించారు.