న్యూయార్క్ : కొత్త వేరియంట్ల విజృంభణతో వ్యాక్సిన్ మిక్సింగ్ (రెండు వేర్వేరు టీకాలను ఇవ్వడం) మంచిదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ స్పందించారు. రెండు వేర్వేరు టీకా డోసులను ఇవ్వడం వల్ల కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్లు మెరుగ్గా పనిచేస్తున్నట్లు తెలుస్తున్నదన్నారు. ‘ఇప్పటికే ఒక డోసు టీకా ఇచ్చి.. వ్యాక్సిన్ కొరతతో రెండో డోసు ఇవ్వలేక ఆగిపోయిన దేశాలకు ఇది ఒక అవకాశమనే చెప్పాలి. ఆయా దేశాలు రెండు విభిన్న టీకా డోసులను తమ ప్రజలకు ఇచ్చే అవకాశమున్నది’ అని పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్ మిక్సింగ్’తో ప్రతిరక్షకాలు, తెల్లరక్త కణాలు అధిక స్థాయిలో ఉత్పత్తి చేయగలిగే బలమైన రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతున్నట్లు వివరించారు.
బూస్టర్ డోసు ఇప్పుడే వద్దు
బూస్టర్ డోసు ఇవ్వడంపై స్వామినాథన్ స్పందిస్తూ.. ‘బూస్టర్ డోసు అవసరమో, లేదోనన్న విషయంపై సమాచారం అందుబాటులో లేదు. కరోనా, వ్యాక్సిన్కు సంబంధించిన అంశాలను శాస్త్రవేత్తలు ఇంకా లోతుగా పరిశోధిస్తున్నారు. కొన్ని దేశాలు తమ ప్రజలకు తొలి డోసు కూడా ఇవ్వలేని స్థితిలో బూస్టర్ డోసు గురించి ఆలోచించడం తొందరపాటు చర్యే’ అన్నారు.