సంగారెడ్డి : ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ అవుతుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సంగమేశ్వర్ లిఫ్ట్ సర్వే పనుల ప్రారంభం సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రైతుబంధు ఆపలేదని స్పష్టం చేశారు. ఒకప్పుడు మెదక్ జిల్లా కరువు జిల్లాగా ఉండేది. ఈ ప్రాంత పరిస్థితులపై సీఎం కేసీఆర్కు పూర్తి అవగాహన ఉందన్నారు.
సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా 11 మండలాల్లో 2 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. 60 నుంచి 70 రోజుల్లోనే డీపీఆర్ తయారు చేయాలని అధికారులను కోరుతున్నాం. జహీరాబాద్ సముద్రమట్టానికి 665 మీటర్ల ఎత్తులో ఉంది. కాళేశ్వరం నీరు కర్ణాటక సరిహద్దు గ్రామాలకు చేరుతుందన్నారు. ఒక్క యాసంగిలోనే 90 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే ధాన్యపు భాండాగారంగా తెలంగాణ మారిందని పేర్కొన్నారు.