యాదాద్రి భువనగిరి, జూన్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అసమాన ప్రతిభతో వాయుసేనలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న బొంతు సీతారావమ్మ, ఆళ్ల తేజశ్రీలు ఈ ఏడాది నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ క్యాట్ పరీక్షకు హాజరై ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత మే 31 నుంచి మైసూర్లో నిర్వహించిన సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షలకు సీతారావమ్మ, వారణాసి నుంచి తేజశ్రీ హాజరైంది. ఐదు రోజులపాటు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించగా శుక్రవారం తుది ఫలితాలు వెలువడ్డాయి. వాయుసేనలోని టెక్నికల్ డిపార్ట్మెంట్కు చెందిన ఉద్యోగాలకు ఎంపికైన ఈ ఇద్దరికి త్వరలోనే మెడికల్ టెస్టులు నిర్వహించి ఏడాదికాలంపాటు శిక్షణ ఇవ్వనున్నారు. సీతారావమ్మ స్వస్థలం ఖమ్మం జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కాగా.. తేజశ్రీ స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా వెంకంపల్లి. రెండు నెలల క్రితం ఇదే కళాశాలకు చెందిన ఫస్ట్ బ్యాచ్ విద్యార్థిని చాముండేశ్వరి వాయుసేనలో ఉద్యోగానికి ఎంపికైంది. దేశంలోనే ఏకైక గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల నుంచి ఏడాదికాలంలోనే ముగ్గురు ఎంపిక కావడంపై ఆ కళాశాల ప్రిన్సిపాల్ మేజర్ యూకే శర్మ హర్షం వ్యక్తం చేశారు.