తక్షణ సాయంగా రూ. 20 వేలు అందజేసిన సుంకె రవిశంకర్
భవిష్యత్లో సహాయ సహకారాలు అందిస్తామని హామీ
గంగాధర, జూన్ 2: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇస్తారిపల్లి గ్రామానికి చెందిన కనమంచుల చంద్రయ్య-నిర్మల దంపతులకు కూతుళ్లు శైలజ(15), అంజలి(13) ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. కాగా, ఎనిమిదేళ్ల క్రితం చంద్రయ్య క్యాన్సర్తో మృతి చెందగా, నిర్మల కూలీ పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను పోషించింది. నెల క్రితం నిర్మల సైతం అనారోగ్యంతో మృతి చెందగా ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు. నిరుపేద కుటుంబం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కు మంటు కాలం గడుపుతున్నారు. వీరి దీనస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బుధవారం ఇస్తారిపల్లికి వెళ్లి చిన్నారులను ఓదార్చారు. తక్షణ సాయంగా రూ. 20 వేల నగదు అందజేశారు. బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేస్తామన్నారు. స్థానిక గురుకుల పాఠశాలలో చేర్పించడంతో పాటు ఉన్నత చదువులు, పెళ్లికి సహకారం అందజేస్తామని భరోసా కల్పించారు. ఉండడానికి ఇల్లు లేకపోవడంతో ప్రభుత్వం తరపున డబుల్ బెడ్రూం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్రావు, సర్పంచులు ఎండీ నజీర్, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, జోగు లక్ష్మీరాజం, ఏఎంసీ డైరెక్టర్ గర్వందుల పరశురాములు, నాయకులు ఎగుర్ల మల్లయ్య, అట్ల శేఖర్రెడ్డి, వడ్లూరి ఆదిమల్లు తదితరులు పాల్గొన్నారు.