ములుగు : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి రాష్ట్రంలోని కొవిడ్ బాధిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ఒక మిషన్ను ప్రారంభించారు. ఈ క్రమంలో భాగంగా ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, పస్రా, చల్వాయి, మోట్లగూడెంతో పాటు ఇతర కుగ్రామాలలో సుమారు 400 కుటుంబాలకు అవసరమైన వస్తువులు, కిరాణా సామాగ్రిని శనివారం విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. దాతలు ముందుకువచ్చి పేదలకు సహాయం చేయాల్సిందిగా కోరారు. కరోనా మహమ్మారి నుండి రక్షణగా విధిగా మాస్కు ధరించాలన్నారు. వీలైతే డబుల్ మాస్క్లు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏఎస్పీ పోతరాజు చైతన్య, ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి, సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ రవీందర్, ఎంపీటీసీ సభ్యురాలు స్వరూప, తదితరులు పాల్గొన్నారు.