న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న సుశీల్ కుమార్ లాకప్లో కుమిలిపోయాడట. ఆరు రోజుల కస్టడీలో భాగంగా పోలీసులు..సుశీల్ను నాలుగు గంటల పాటు విచారించారు. హత్యకు దారితీసిన పరిస్థితులపై సుశీల్ నుంచి పోలీసులు పలు కీలక అంశాలు సేకరించినట్లు తెలుస్తున్నది. మోడల్టౌన్ స్టేషన్లో ఉన్న సుశీల్..రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడని, భోజనం చేసేందుకు నిరాకరించాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. క్రైమ్సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఛత్రసాల్ స్టేడియానికి సుశీల్ను తీసుకెళ్లిన పోలీసులు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాణాను బెదిరించేందుకు మాత్రమే తాను ప్రయత్నించానని సుశీల్ చెప్పుకొచ్చాడట. హత్య జరిగిన రోజు అక్కడే స్టేడియంలో ఉన్న సుశీల్..రాణా మరణించిన విషయం తెలిసిన తర్వాత అక్కడి నుంచి పరారైనట్లు విచారణలో తేలింది. కాగా సుశీల్ కాంట్రాక్టును తాము పునరుద్ధరించడం లేదని జాతీయ రెజ్లింగ్ సమాఖ్య మంగళవారం పేర్కొంది.