సుల్తాన్బజార్, మే 23: కరోనా నుంచి కోలుకొన్న ఓ వృద్ధురాలికి రెండు రోజులకే బ్లాక్ఫంగస్ సోకింది. దాంతోపాటు రెండోసారి కూడా కరోనా సోకింది. ఈ ఘటన కోఠి ఈఎన్టీ దవాఖానలో చోటుచేసుకొన్నది. వరంగల్రూరల్ జిల్లా నాగారానికి చెందిన వంగ మల్లమ్మ ఈ నెల 3న కొవిడ్ బారినపడి స్థానిక ప్రైవేటు దవాఖానలో చేరింది. 15 రోజుల పాటు చికిత్స అందాక వైరస్ నుంచి కోలుకోవటంతో ఆమెను డిశ్చార్జి చేశారు. రెండు రోజులకే మల్లమ్మకు ముక్కు దిబ్బడ, కండ్లచుట్టూ వాపు రావటంతో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు బ్లాక్ఫంగస్గా గుర్తించి కోఠి ఈఎన్టీ దవాఖానకు సిఫారసు చేశారు. ఓ ప్రైవేటు ల్యాబ్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించి ఆదివారం ఈఎన్టీ దవాఖానకు తీసుకొనివచ్చారు. పరీక్ష ఫలితాలు రాకపోవటంతో సిబ్బంది చేర్చుకోలేదు. సాయంత్రం మల్లమ్మ ముక్కు నుంచి నల్లగా రక్తం కారటంతో డాక్టర్లు క్యాజువాల్టీకి తరలించి పరిశీలించారు. ఆలోగా ఆమెకు మరోసారి పాజిటివ్ వచ్చినట్టు మల్లమ్మ మనుమడి ఫోన్కు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆమెను ఈఎన్టీ దవాఖాన నుంచి గాంధీ దవాఖానకు తరలించారు.