దేశంలోనే అతిపెద్ద కాఫీ డే చైన్ నెట్వర్క్ (సీడీఈఎల్) దివాళా (bankruptcy) దిశగా అడుగులేస్తున్నది. ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న కాఫీ డే ఎంటర్ ప్రైజెస్.. 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రుణ వాయిదాలను చెల్లించ లేకపోయింది. దీంతో కాఫీ డే సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకర్లు.. ఆ సంస్థపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాలపై మార్చి త్రైమాసికంలో రూ.280 కోట్ల మేరకు రుణ వాయిదా చెల్లించాల్సి ఉందని ఎక్స్చేంజ్ ఫైలింగ్లో కాఫీ డే పేర్కొంది. ద్రవ్య లభ్యత సంక్షోభం వల్ల కాఫీ డే మొత్తం రూ.518 కోట్ల రుణ భారంతో డిఫాల్టర్గా మారింది.
ఈ నేపథ్యంలో కాఫీ డే అనుబంధ సంస్థల నుంచి బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు తమ బకాయిల వసూళ్లకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి. తమ వెండింగ్ మిషన్ల బిజినెస్ను టాటా గ్రూప్కు విక్రయించేందుకు కాఫీ డే ప్రయత్నించింది. కానీ కాఫీ డే చైన్ కంపెనీ మార్కెట్ విలువ ఖరారుపై ఏకాభిప్రాయం కుదరక టాటా గ్రూప్తో చర్చలు విఫలమైనట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు కాఫీ డే షేర్ల ట్రేడింగ్ను స్టాక్ ఎక్స్చేంజీలు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నగదు లభ్యత సమస్యల వల్లే సంస్థ వ్యవస్థాపకుడు వీ సిద్ధార్ధ.. 2019 జూలైలో అనూహ్య పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తనపై పీఈ సంస్థలు, రుణ దాతలు, ఆదాయం పన్నుశాఖ అధికారులు ఒత్తిళ్లు తేవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సిద్ధార్థ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2020లో కాఫీ డే స్వయంగా నిర్వహించిన దర్యాప్తులో సంస్థకు 2019 జూలై నాటికి రూ.3,535 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
కాఫీడే అనుబంధ సంస్థల్లో రూ.842 కోట్లు ఉంటే, మిగతా రూ.2,693 కోట్లు కాఫీ డే సొంతంగా పెట్టుబడులు కలిగి ఉన్నది. మరోవైపు కాఫీ డే సంస్థల్లో వ్యవస్థాపకుడి ఆస్తుల నుంచి రుణాలను రికవరీ చేయడానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎల్ మంజునాథ్ సారధ్యంలో కమిటీని నియమించింది.
ఈ నేపథ్యంలోనే మైండ్ ట్రీ కంపెనీలో తన వాటాను కాఫీ డే రూ. 1975 కోట్లకు విక్రయించి రుణ సంస్థలకు వాయిదాలు చెల్లించింది. తాజాగా కర్ణాటకలోని కాఫీ ఎస్టేట్స్ను విక్రయించి రుణ భారం తగ్గించుకోవాలని భావిస్తోంది.
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
మహీంద్రాతో ఫ్లిప్కార్ట్ డీల్