అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నిబంధన అమలు కాలేదని పేర్కొంటూ ఎన్నికలను నిలిపివేయాలని మంగళవారం హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చింది.
దీంతో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సింగల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ అప్పిల్కు వెళ్లింది.
ఈ పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టి.. ఇరుపక్షాల వాదనలు విన్నది.
ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియపై జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని సూచించింది.
రాష్ట్రంలోని 516 జడ్పీటీసీ, 7,258 ఎంపీటీసీ స్థానాలకు రేపు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది.
పోలింగ్ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి