హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసగించి భారీగా డబ్బులు దండుకున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సుధాకర్ అనే వ్యక్తి నేతలు, ఉన్నతాధికారుల పీఏనని చెప్పుకుంటూ మోసాలు పాల్పడుతున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిందితుడికి సహకరించిన భీమయ్య, నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు.
సుధాకర్ ఇప్పటివరకు 82 మందిని మోసం చేసినట్లుగా తేలిందన్నారు. రూ.3 కోట్ల మేర నగదు వసూలు చేసినట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.03 కోట్లు, రూ.కోటి విలువ చేసే ఇంటి పత్రాలు, నకిలీ ఐడీ కార్డులు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సుధాకర్పై ఇప్పటికే నగర పరిధిలోని 3 కమిషనరేట్ పరిధుల్లో 8 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.