న్యూఢిల్లీ, మార్చి 25: పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. దీంతో రెండునెలల పాటు కొనసాగిన బడ్జెట్ సమావేశాలు ముగిసినట్టయింది. జనవరి 29న ప్రారంభమైన సమావేశాలు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 8 వరకు కొనసాగాలి. కానీ ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని పలువురు ఎంపీలు చెప్పటం, దీనికితోడు కరోనా మరోసారి వ్యాపిస్తున్నందున ముందుగానే వాయిదా వేశారు. దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, అభివృద్ధికి నిధులు సమకూర్చే జాతీయ బ్యాంకు (ఎన్ఏబీఎఫ్ఐడీ) ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు గురువారం ఆమోదించింది. ప్రతి ఏటా ఈ బ్యాంకు ఖాతాలను ఆడిటింగ్ అనంతరం పార్లమెంటు ఉభయ సభల ముందుంచుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బ్యాంకులో ప్రభుత్వ వాటా మొదట్లో 100 శాతం ఉంటుందని, నెమ్మదిగా 26 శాతానికి తగ్గిస్తామని చెప్పారు.