వేసవిలో ఇక్కట్లు లేకుండా చర్యలు
సాసర్పిట్లలో దప్పిక తీర్చుకునేలా చర్యలు
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
పలు చోట్ల సోలార్ పంపుల ఏర్పాటు
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ పెంచికల్పేట్, మార్చి 24:వేసవి వచ్చేసింది.. అరణ్యంలోని జీవాలకు నీటి తిప్పలను తీర్చేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. జిల్లాలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల నీటి గోస తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయా చోట్ల 120 సాసర్పిట్లు నిర్మించగా, తాగునీటికి ఇక్కట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా నీటిని తరలించడమే కాకుండా సమీప ప్రాంతాల్లో సహజ సిద్ధమైన నీటి వనరులు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో సోలార్ పంప్సెట్లను ఏర్పాటు చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ పెంచికల్పేట్, మార్చి 24: వేసవి కాలం ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. అప్పుడే వాగులు, వంకలు వట్టిపోతున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న నీటి వనరులు ఎండిపోతుండడంతో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడే అవకాశం ఉంది. దీంతో గ్రామాల వైపు వచ్చి, ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. దీంతో వేసవిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. అడవుల్లో సాసర్ పిట్లు ఏర్పాటు చేయడం, సహజ సిద్ధమైన నీటి వనరులను పెంపొందించడం వంటి పనులు చేపడుతున్నది. వన్యప్రాణులకు అవసరమైన పచ్చికను పెంచడంతోపాటు నీటి వనరులను అభివృద్ధి చేస్తోంది. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో 120 సాసర్ పిట్లను ఏర్పాటు చేశారు. వన్య ప్రాణులు ఎక్కువగా సంచరించే ఏరియాల్లో నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున నిర్మించారు. అడవుల్లో సహజ సిద్ధంగా ఉన్న నీటి కుంటల్లో, చెలిమెల్లో ట్యాంకర్ల సహాయంతో నీటిని నింపుతున్నారు. పర్క్యులేషన్ ట్యాంకులను కూడా నిర్మించారు. శాకాహార జంతువుల ఆహారం కోసం ప్రత్యేకంగా గడ్డిని పెంచుతున్నారు. ఇటీవల జిల్లాలో పులుల సంచారం పెరగడంతో, వాటికి ఆహారంగా జింకలను అడవుల్లో వదిలారు. ఈ వన్యప్రాణులకు కూడా ఆహారం, నీటి కొరత రాకుండా చర్యలు చేపట్టారు. దాదాపు 70 హెక్టార్లలో పచ్చికను పెంచుతున్నారు. అడవుల్లో జింకలు, దుప్పులు, కుందేళ్లు, ఇతర శాకాహార జంతువులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా చర్యలు తీసుకుంటున్నారు. అడవుల్లో మంటలు అంటుకోకుండా ప్రత్యేక దృష్టి పెట్టారు. సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
పెంచికల్పేట్ రేంజ్లో సోలార్ పంపుల ఏర్పాటు
పెంచికల్పేట్ అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు రెండు చోట్ల సోలార్ పంపులను ఏర్పాటు చేసినట్లు రేంజ్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. వీటి ద్వారా నిరంతరం జంతువులకు నీరు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. వన్యప్రాణులకు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.