జగిత్యాల : ఈ నెల 24 నుంచి జరుగనున్న ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించారు. శనివారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ధర్మపురి ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, నంబి శ్రీనివాసాచార్యులు స్పీకర్కు శాలువా కప్పి సత్కరించి శాస్త్రోక్తంగా ఆశీర్వవచనం చేశారు.
మంత్రి వెంట కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సత్తెమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, బుగ్గారం జడ్పీటీసీ బీ రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ చైర్మన్ సునీల్, టీఆర్ఎస్ ధర్మపురి పట్టణ శాఖ అధ్యక్షుడు చిలివేరి శ్యాంసుందర్, ఆలయ ఈఓ శ్రీనివాస్ తదితరులున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి రాజేశం గౌడ్లను సైతం మంత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.