న్యూఢిల్లీ, మార్చి 12: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏండ్లకే పరిమితమవ్వడం దురదృష్టకరమని పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. న్యాయశాస్ర్తానికి సంబంధించిన ఆంశాల ఆకళింపు, పూర్తి విజ్ఞానం 65 ఏండ్ల వయసులోనే ఎక్కువగా ఉంటుందని.. ఇలాంటి ఉత్కృష్ట సమయంలో రిటైర్మెంట్ నిబంధన సరైన ఆలోచన కాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా శనివారం పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్.. సుప్రీంకోర్టు జడ్జిల రిటైర్మెంట్ వయసు గురించి పై విధంగా స్పందించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే మాట్లాడుతూ.. జస్టిస్ ఇందు మల్హోత్రా కంటే శ్రేష్టమైన న్యాయమూర్తిని తాను చూడలేదన్నారు. న్యాయవాది నుంచి డైరెక్టుగా సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా జస్టిస్ ఇందు మల్హోత్రా రికార్డు సృష్టించారు. 2018 నుంచి మూడేండ్ల పాటు ఆమె అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా సేవలు అందించారు. కాగా రిటైర్మెంట్ వయసు ప్రభుత్వ ఉద్యోగులకు 58 ఏండ్లు కాగా, హైకోర్టు న్యాయమూర్తులకు 62 ఏండ్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 సంవత్సరాలుగా ఉన్నది.