న్యూఢిల్లీ, మార్చి 12: రాష్ట్ర ప్రభుత్వ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు(ఎస్ఈసీ)గా నియమించడంపై దేశ అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న అధికారి.. ఎస్ఈసీగా విధులు నిర్వహించకూడదని తేల్చి చెప్పింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర న్యాయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అధికారి ఒకరికి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ గోవా ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్నది. దీనిపై బాంబే హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ గోవా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్ను విచారించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని స్వతంత్ర వ్యక్తి ఎస్ఈసీగా ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఎస్ఈసీగా విధులు నిర్వహించాలనుకుంటే ముందుగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టవచ్చని వెల్లడించింది.