ముంబై: నాలుగేండ్ల బాలికను లైంగికంగా వేధించిన 80 ఏండ్ల వృద్ధ దంపతులకు పోక్సో ప్రత్యేక కోర్టు పదేండ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గిర్గావ్ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ జంట 2013లో ఈ దారుణానికి పాల్పడింది. పొరుగున ఉన్న నాలుగేండ్ల బాలికను తమ ఇంటికి పిలిపించి లైంగికంగా వేధించారు. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన పోక్సో ప్రత్యేక కోర్టు బాధిత బాలిక, తల్లి వాంగ్మూలం, వైద్య రిపోర్టుల ఆధారంగా ఆ వృద్ధ జంట ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించింది. తాత, అమ్మమ్మ వయసున్న వారు బాలికను ప్రేమతో చూసుకోవాల్సిందిపోయి లైంగికంగా వేధింపులకు గురి చేయడాన్ని ఖండించిన కోర్టు వారిని దోషులుగా పేర్కొంది. పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి రేఖ పంధారే ఆ వృద్ధ జంటకు పదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.